వంటింట్లో తాలింపు మోత వినకుండా వంట సంపూర్ణం అయినట్లుండదు. పోపుల పెట్టేతో మహిళలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అంతే కాదు, ఆ పోపుల పెట్టె లోనే మహిళల అనారోగ్య సమస్యలను నివారించే పోషకాలూ ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు మొదలుకొని నెలసరి సమస్యలకూ ఉపశమనం లభించే ఆ పదార్థాల గురించి..
ముత్యమంత పసుపుతో మేలు ఎంతో..
ఇంటింటా ఉండే సుగుణాల ఔషధి..పసుపు..మేనికి మేలు ఛాయ ను ఇచ్చే ఈ అద్భుత ఔషధంలో క్యాల్షియం, ఫాస్ఫరస్, థయామిన్ వంటి పోషకాలతో పాటు మహిళల్లో రక్త హీనతను తొలగించే ఇనుమూ , ఎ విటమినులు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కర్కుమిన్ అనే ప్రత్యేక పదార్థానికి క్యాన్సర్ ను ఎదురించి పోరాడే శక్తి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ్. చిన్న పిల్లల్లో నులి పురుగులు సమస్యకు గ్లాసు నీటిలో అర చెంచా పసుపు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది.
రక్త హీనత నివారించే జీలకర్ర..
ఉప్మా,పులిహోర,కూర ..పదార్థమేదైనా జీలకర్రతోనే నోరూరించే రుచి. కేవలం రుచిని మాత్రమే కాదు మగువల ఆరోగ్యానికి అవసరమయ్యే ఫోలిక్ , ఇనుము లను అందించే శక్తి దీని సొంతం. శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సెలీనియం వంటి ఖనిజాలనూ జీలకర్ర అందిస్తుంది. పైత్యం, కఫం, వాతం, జ్వరం , కడుపు నొప్పి, తల తిరగడం వంటి సమస్యలకు ఇది చక్కటి వైద్యం. కడుపులో వాయువులను నియంత్రిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం జీలకర్రను పొడి కొట్టి కషాయంగా కాచి తాగొచ్చు. నిమ్మ రసంలో కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఐతే అర చెంచా మించకుండా తీసుకోవాలి.
అధికంగా తీసుకుంటే పంచదార విరుగుడుగా పని చేస్తుంది.
కొవ్వును తగ్గించే ఆవాలు..
పోపులో చిటపట మంటూ సందడి చేసే ఆవాలు .. శరీరంలోని వ్యర్థాలను బయటికి నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఉంది. మహిళలు తరచూ ఎదుర్కునే నెలసరి సమస్యలు దూరం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముక బలానికి ఉపయోగపడే క్యాల్షియం , రక్త హీనతను నివారించే ఇనుము ఆవాలలో అధికం. వీటిని ముద్దలా నూరుకుని వేడి నీరున్న బకెట్ లో వేసి స్నానం చేస్తే ఒంటి నొప్పులు మాయమవుతాయి. ఆవ నూనె శరీరంలోని అనవసర కొవ్వు పెరగకుండా కాపాడుతుంది.
ఆవాలకు విరుగుడు పాలు.
అజీర్ణం తగ్గించే మెంతులు..
పచ్చళ్లలో, తాలింపులో రుచి కోసం ప్రత్యేకంగా వాడే మెంతుల ఉపయోగం అటు మధుమేహ రోగులకు మొదలుకొని ఇటు గర్భిణుల వరకు ఎంతో ఉంది. ఇది పేగుల పని తీరును మెరుగు పరిచి .. అజీర్ణ సమస్యలు తొలగిస్తుంది. చెంచాడు మెంతులను నీటిలో నానబెట్టి మరునాడు తీసుకుంటే రక్తం శుభ్ర పడుతుంది. కొవ్వు, చక్కెర శాతం కొంత వరకు నియంత్రణలోకి వస్తాయి. దీనిలో శరీరానికి మేలు చేసే బీటా కెరోటిన్లు సమృద్ధిగా లభిస్తాయి. గర్భిణులు మితంగా తీసుకుంటే మేలు.
దీనికి విరుగుడు మంచి నీరు..
నెలసరి వెతలు.. ధనియాలతో దూరం..
తల తిరగడం, అధిక ఋతు స్రావం వంటి సమస్యలతో బాధ పడేవారు , వీటిని కషాయంగా కాచి తాగితే ఫలితం ఉంటుంది . జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాలతో పాటు వీటిని తీసుకోవాలి. ఆకలి తగ్గిన వారు వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ధనియాలను రాత్రి నీటిలో కాచి పొద్దుటే తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి..
కఫం పోగొట్టే మిరియాలు..
శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే మిరియాలు కఫ దోషాలు ఉన్నవారికి బాగా ఉపకరిస్తాయి. రోజూ పాలలో లేదా నీటిలో పొడి వేసి తాగాలి. వీటిలో ఇనుము, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, ఫ్లెవనాయిడ్ లు ఉంటాయి. ఇవి శరీరంలో తేమను పెంచి కఫాన్ని బయటకు నెడతాయి. ఇవి ఉదరంలో వాయువులు పెరగకుండా చూస్తాయి. రక్త ప్రసరణ ను మెరుగు పరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి. అధికంగా దాహం వేసినప్పుడు వీటిని నేతిలో వేయించి మజ్జిగలో కలిపి తీసుకోవాలి.
వీటికి విరుగుడు మజ్జిగ..
చర్మ వ్యాధులకు.. దాల్చినీ..
రుచిలో తియ్యగా ,వగరుగా , ఘాటుగా అనిపించే దాల్చినీ వల్ల ఎన్నో ఉపయోగాలు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చెక్క, పొడి ఏ రూపంలో తీసుకున్నా .. దీనిలోని సుగుణాలు చర్మ వ్యాధులు ఉన్న వారికి ఇతర ఔషధాలతో పాటు కలిపి వైద్యంగా ఇస్తుంటారు . కఫ, పైత్య సమస్యలతో బాధ పడేవారికి పొడిగా ఇస్తే ఫలితం ఉంటుంది. బ్యాక్టీరియాను వృద్ధి చెందకుండా చేస్తుంది. జలుబు, దగ్గుతో బాధ పడేవారికి దీనిని మిరియాలు, యాలకుల పొడిని సమ పాళ్ళలో కలిపి, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే సమస్య పరిష్కారమవుతుంది. నెలసరి ఇబ్బందులు ఎదుర్కునే వారు దాల్చిన చెక్క పొడి చేసి , తమలపాకు రసం లో కలిపి వారం ముందు నుంచి తీసుకుంటే ఇబ్బందులు ఉండవు.
ఇంగువ.. దగ్గు నివారిణి..
పేగుల్లో పెరిగే క్రిములను ,హాని కారక వైరస్లను దూరం చేసే శక్తి ఇంగువకు ఉంది.ఆహారం తేలికగా జీర్ణం అవడానికి ,శరీరంలో వాయువులను నియంత్రించడానికి ఇది దోహదం చేస్తుంది. దీన్ని నెలసరికి ముందు శనగ గింజంత బెల్లం తో కలిపి తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. దగ్గు,ఆయాసంతో బాధ పడుతుంటే దీన్ని పెసర గింజంత తీసుకుని ఉల్లిపాయ రసం, తేనె తో కలిపి పుచ్చుకుంటే గుణం ఉంటుంది.
జలుబు తగ్గించే వాము..
నోట్లో వేసుకోగానే చిరు చేదుగా అనిపించే వాము ..శరీరంలో క్రిములు వృద్ధి చెందకుండా చూస్తుంది.అజీర్ణ సమస్యలను ,అతిసారాన్ని తగ్గిస్తుంది. వామును కాల్చినప్పుడు వచ్చే పొగ జలుబును తగ్గిస్తుంది.కడుపుబ్బరంగా ఉన్నప్పుడు చెంచాడు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.ముఖ్యంగా పాలు పడని వారికి దీని రసం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది.వామును , సైంధవ లవణం తో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది.
వికారం నుంచి ఉపశమనం..
అనేక సుగుణాలు ఉండే వాముని భోజనానంతరం తీసుకుంటే ఆహారం తేలిగ్గా జీర్ణమవ్వడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తాయి.లవంగాలను దంచి నీళ్లలో ఉడికించి తాగితే వాంతులు,వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.తలనొప్పి బాధలో లవంగాలను పాలలో కలిపి పుచ్చుకోవాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి