2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఏ వ్యాధి కలవారు.. ఏ ఔషధాలు వాడవచ్చు.

 వాత వ్యాధులకు..

 1. మహా రాస్నాది కషాయం లేక గోక్షురాది గుటికలు. 2. అర్కాది తైలం 3. త్రిఫల కల్పం. 4. అశ్వగంధ గృతం తీపిలేకుండా + శిలాజిత్. 

గ్యాస్ మొదలగు ఉదర వ్యాధులకు..

1. త్రిఫలా కల్పం 2. హింగ్వాష్టకం 3 . ఆర్ద్రక ఖండం వాడుకోవాలి.

దగ్గు, ఆస్తమా మొదలగు కఫ రోగాలకు..

1. సీతో ఫలాది చూర్ణం 2. తులసి మాత్రలు.3.త్రిఫల రసాయనం ( తేనెతో రాత్రి ) 4. తులసి టీ  5. భృగు హరితకి ( నిర్మలీ) వాడుకోవాలి.

తెల్ల లేక ఎర్ర బొల్లి మచ్చల కు..

1. ఖదీరాది కషాయం 2. సుగంధ పాల లేహ్యం 3. స్వర్ణ తైలం( గోల్డ్ ఆయిల్) 4. శ్విత్ర అధర లేపనం. 5. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ వ్యాధులకు..

1. మంజిష్టాది కషాయం .2. సుగంధ పాల లేహ్యం.3. సింధూరాది తైలం. 4. త్రిఫల కల్పం.5. ఖాదీరాది కషాయం.6. కామధేను ఆర్కం వాడుకోవాలి.

చర్మం పై పైత్య దురదలు ,దద్దుర్లకు..

 1. ఆర్ద్రక ఖండం.2. త్రిఫల రసాయనం. 3. గోక్షూరాది అవలేహ్యం . 4. సింధూరాది తైలం వాడుకోవాలి. 


31, ఆగస్టు 2026, సోమవారం

ఫిట్స్, చెవి దగ్గర కాయ, మూత్రంలో మంట.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. ఫిట్స్ సమస్య .. ఆయుర్వేద పరిష్కారాలు 


నల్ల నువ్వులు దోరగా వేయించి దంచి జల్లించి చేసిన పొడి 100 గ్రాములు , వెల్లుల్లి దంచి తీసిన రసం 100 గ్రాములు .. ఈ రెండింటిని కలిపి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరి బఠాణీ గింజంత గోళీలు కట్టి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి పూర్తిగా నీరు ఇంకిపోయిన తర్వాత ఆ గోళీలను ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండు లేక మూడు పూటలా ఒక మాత్ర మంచి నీటితో సేవిస్తుంటే క్రమంగా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఐతే ఫిట్స్ వచ్చిన వెంటనే సీతా ఫలం ఆకు మెత్తగా నలగ్గొట్టి వాసన చూపిస్తే క్షణ మాత్రంలోనే తెలివి వస్తుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఫిట్స్ సమస్య నుండి బయట పడవచ్చు. 

2 . చెవి కుట్టిన చోట కాయ పెరిగిన సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఇంట్లో కొట్టుకున్న మంచి పసుపు ఒక చెంచా తీసుకొని సగం ముద్ద వేడి అన్నం పసుపుతో కలిపి మెత్తగా పిసికి ఆ కాయ మీద పెట్టి ఊడిపోకుండా దాని పైన దూది పెట్టి ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ రాత్రి పూట పెట్టి ఉదయం తీసివేస్తుండాలి. కొద్ది రోజులకు కాయ పెరగడం ఆగి నిదానంగా తగ్గడం మొదలవుతుంది.

3 . మూత్రంలో మంట సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

మూలికలు అమ్మే దుకాణంలో నేల వేము, నేల ఉసిరి , సుగంధ పాల వేళ్ళు, గుంట గలగర , తిప్ప తీగ ఒక్కొక్కటి 200 గ్రాముల చొప్పున తెచ్చుకోవాలి.వీటిని విడి విడిగా పొడి చేసి కలిపి ఉంచుకోవాలి. రోజూ రెండు గ్లాసుల నీటిలో రెండు చెంచాల పొడి వేసి రెండు కప్పుల కషాయానికి మరిగించి వడపోసి పూటకు ఒక కప్పు కషాయం గోరు వెచ్చగా మాత్రమే ఒక చెంచా తేనె కలిపి తాగుతుండాలి. దీని వల్ల మూత్రంలో మంట,చురుకు మొదలైన సమస్యలు తగ్గిపోయి మూత్రం పూర్తిగా శుద్ధి చెందుతుంది. దాంతో పాటు రక్తం కూడా శుద్ధి చెందుతుంది.

శరీరానికి మంచి కాంతి, వర్చస్సు సిద్ధిస్తుంది.

 



జలుబు, దంతాల సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 దీర్ఘ కాలికంగా జలుబు, పిల్లి కూతలతో ఆయాసం. . ఆయుర్వేద పరిష్కారాలు.

ఉత్తరేణి చెట్లు, వాకుడు చెట్లు,అడ్డసరం ఆకులు కాడలు సమ భాగాలుగా తెచ్చుకోవాలి . అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కడిగి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఆ ముక్కలను శుభ్రమైన రాతి మీద పోసి నిప్పు అంటించి బూడిదగా చేయాలి. దానిని జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు లేదా మూడు పూటలా ఒక చెంచా పొడిని ఒక చెంచా తేనె తో కలిపి నిదానంగా సేవిస్తుండాలి. ఎంత కాలంనుండి ఉన్న ఆయాసమైనా, ఆస్తమా అయినా , పిల్లి కూతలైనా తప్పకుండా తగ్గిపోతాయి. 

దంతాలు కదలడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

బాగా ముదిరి ఉన్న ఉత్తరేణి చెట్టును చూసుకుని పూజ చేసి సమస్యను మనసులోనే తెలిపి ఆ చెట్టును పీకి దాని వేళ్ళను ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి చూపుడు వేలంత ముక్కలుగా తయారు చేసుకొని ఆరబెట్టాలి. రోజూ ఒక ముక్కతో నిదానంగా మృదువుగా  దంతాలను అన్ని వైపులా తోముతుండాలి. తోమిన తర్వాత అరగంట ఆగి గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా చేస్తుంటే క్రమంగా దంతాలు తెల్లబడి , దృఢంగా జీవిత కాలమంతా కళకళలాడుతుంటాయి. 

కళ్ళు, గర్భ సంచి సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 కనురెప్పల్లో చీము గడ్డల సమస్య.. 

తలలో అధికమైన అనవసరమైన కఫం చేరడం వల్ల ఈ సమస్య కలుగుతుంది.

1. ) ముందుగా అధికంగా కఫం పెంచే పదార్థాలను ఆహారంలో తీసుకోవద్దు. 2. ) త్రిఫలాల ముక్కలు ఒక్కొక్కటి పది ముక్కల చొప్పున మొత్తం 30 ముక్కలు ఒక గ్లాసు వేడి నీటిలో రాత్రి వేసి ఉదయం వరకు ఉంచి వడపోసుకోవాలి. ఆ నీటిని ఉదయం పూట కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని మూసిన కన్నులపైన తడపాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట చేయాలి. 3. ) ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక చెంచా పసుపు వేసి అర గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి నూలు బట్ట నాలుగు మడతలు వేసి ఆ కషాయంలో ముంచి నీళ్ళు కారకుండా కొంచెం పిండి ఆ తడి బట్టను గోరు వెచ్చగా ఉన్నప్పుడు మూసిన కన్నులపైన వేసుకుని పది లేక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఆచరించాలి. 4.) పలుచగా ఉన్న ప్రశస్తమైన వేప నూనె రెండు ముక్కుల్లో రెండు రెండు చుక్కలు రెండు పూటలా ఆహారానికి అరగంట ముందుగా వేస్తుండాలి. 

గర్భ సంచి మందంగా మారిన సమస్య..

1.) కలబంద గుజ్జు ఆపకుండా మూడు నెలల వరకు సాయంత్రం పూట సేవించాలి. 2.) అశోక చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా మేడి చెట్టు వీటిలో ఏదో ఒక చెట్టుకు పూజ చేసి మాను మీద ఉండే బెరడు 2,3 కేజీలు తీసుకోవాలి. తీసిన చోట మాను మీద దట్టంగా ఆవు పేడ పూసి రావాలి. ఆ బెరడును 50 గ్రాములు తూకం ఉండే విధంగా ముక్కలు కొట్టి కడిగి ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక ముక్క వేసి ఒక రోజు నానబెట్టి చిన్న మంట పైన ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి ఆ ముక్కను తీసివేసి , ఆ కషాయంలో ఒక చెంచా కండ చక్కెర పొడి కలిపి గోరు వెచ్చగా పరగడుపున తాగాలి. 3.) వేపాకు పావు కేజీ, మంచి పసుపు 20 గ్రాములు, కలబంద గుజ్జు 100 గ్రాములు , తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి ముద్దలాగా చేసి వెల్లకిలా పడుకుని ఆ ముద్దను పొత్తి కడుపు పైన పట్టులాగా వేసి పలుచని బట్ట పైన వేసి ఆ గాలి తగలకుండా దుప్పటి కప్పుకుని అర గంట వరకు ఉంచి తీసివేయాలి. ఇలాగే రేగడి మట్టితో కూడా రెండవ పూట పట్టు వేసుకోవచ్చు. 4. ) పావు చెంచా మిరియాల పొడి , అర చెంచా ఉసిరి కాయల పొడి , ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో వేసి ఆహారానికి ఒక గంట ముందు కానీ తర్వాత కానీ సేవించాలి. 5.) కపాల భాతి ప్రాణాయామం , పశ్చిమోత్తాసనం, వక్రాసనం, పవన ముక్తాసనం , భుజంగాసనం , శలభాసనం రోజూ రెండు పూటలా పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఆచరించాలి. ఇలా చేస్తుంటే సర్జరీతో అవసరం లేకుండా గర్భ సంచిలో గడ్డలు కరిగి పోతాయి. 

మహాత్ముడు మెచ్చిన.. అవిసె గింజలు

 ఆయుర్దాయం పెరగడంలో ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆయుర్దాయం పెంచుకోవడానికి ఇవాళ ఎన్నో అవకాశాలు, సులువైన ఆరోగ్య విధానాలు, ఆరోగ్య కరమైన ఆహార పద్ధతులు, ఆహార అలవాట్లు, విస్తృత శ్రేణిలో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లకు దూరంగా ఉంటూ , తగిన శారీరక వ్యాయామం చేస్తూ , చక్కటి ఆహార అలవాట్లు పాటిస్తూ , పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల నిత్యం శారీరకంగా ఎంతో చురుకుగా ఉండవచ్చని , ఆహార అలవాట్లు, జీవన శైలి జీవిత కాలాన్ని పెంచడంలో కీలకం కాగలవని పరిశోధకులు అంటున్నారు. 

ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త ఐటమ్స్ తీసుకోదగ్గ ఆహార పదార్థాల జాబితాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖంగా వినబడుతున్న అవిసె గింజలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇవాళ కొత్తగా వినిపిస్తున్నా నిజానికి అవిసె గింజలకు వేన వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. ఆవిసెలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయ గలవని ఇటీవలి పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 

ఎక్కడైతే అవిసె గింజలను ప్రజలు తమ దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటారో అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లివిరుస్తుంది అని మహాత్మా గాంధీ ఏనాడో అన్నారు. నిజమే.. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అవిసె అత్యంత శక్తివంతమైనది. 

భారత దేశంలోని గ్రామాలలో అవిసె గింజలను కీళ్ల నొప్పులు , దగ్గు, జలుబు నయం చేయడానికి పచ్చళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు. స్థానిక పచారీ కొట్టులన్నీ అద్భుతమైన ఈ అవిసె గింజలను నిల్వ చేసుకుంటాయి. మన పూర్వీకులు ఈ అవిసె గింజల తో ఎన్నో రకాలుగా వైద్యం చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు వీటితో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. 

ఈ అవిసె గింజల తో చట్నీలు, చెక్కీలు,పొడులు , లడ్డూలు చేస్తుంటారు. వాటిని తీయగానో, ఉప్పగానో పొడి రూపంలో తినవచ్చు. అవిసె గింజలను స్వల్ప పరిమాణంలో ఉపయోగించినప్పటికీ అవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. ఆవిసెలు జీవక్రియ రేటు ను పెంచి ఆక్సీకరణను చైతన్య పరుస్తాయి. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీని వలన శరీరంలో వేడి పడుతుంది. చలి కాలం, వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గులను నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. 

అవిసె గింజల లో పీచు,ఖనిజాలు , విటమిన్ లతో పాటు మాంస కృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి మాంస కృత్తులు దోహదం చేస్తాయి. పీచు పదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. కొలోన్ ఆరోగ్యాన్ని క్రమ బద్ధం చేస్తాయి. మల బద్ధకం సమస్య తలెత్తదు. అవిసెలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను నివారించడం ద్వారా గుండె రోగాలు, కీళ్ల వాతం, ఉబ్బసం, షుగర్, ఇంకా కొన్ని క్యాన్సర్ల( ప్రత్యేకించి పౌరుష గ్రంధి క్యాన్సర్) నుంచి శరీరాన్ని కాపాడతాయి. 

లైంగిక దుర్భలతతో బాధ పడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల మేలు చేకూరుతుంది. ఈ గింజలలోని ఫోలిక్ యాసిడ్ వ్యంధ్య మహిళలకు తోడ్పడతాయి. అవిసె గింజల లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని క్షాళన చేస్తాయి. రక్తాన్ని శుద్ధి గావిస్తాయి. 

చర్మం, శిరోజాల పరిస్థితిని మెరుగు పరుస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. మామూలు జలుబు, దగ్గులనుంచి రక్షణ ఇస్తాయి. 

ఈ గింజల నుంచి తీసే అవిసె నూనె చుండ్రు, పొడి చర్మం, సూర్య రష్మి వేడిని తట్టుకోలేని సున్నితమైన చర్మాలకు బాగా పనిచేస్తుంది. ఎగ్జిమా లను నయం చేస్తుంది. ఎండ వల్ల చర్మం పేలడం , చెమట కాయలు రావడం లాంటి వాటిని నివారిస్తుంది. 

ఇబ్బందికరమైన రుతుచక్రం నిలిచి పోయే దశలో ఈ గింజలలోని ఫైటో ఈస్ట్రోజన్స్ స్త్రీలకు సహాయపడతాయి. మహిళల్లో రుతు క్రమానికి ముందు తలెత్తే ( పిలిమిలిన్ ) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి. 

ఒక టీ స్పూన్ అవిసె గింజలను చప్పరించడం , నమలడం వలన ఉదర సంబంధిత సమస్యలు రావు. పెప్టిక్ అల్సర్లు నయమవుతాయి. శరీరం ముడతలు పడకుండా వాడే రసాయనిక క్రీములకు బదులుగా అవిసె నూనెను వాడవచ్చు. అవిసెలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని మృదువుగా , ముడతలు లేకుండా ఉంచుతాయి. అన్ని రకాల మైగ్రేన్ నొప్పులకు అవిసె నూనె బాగా పనిచేస్తుంది. ఆస్తమా , ఎలర్జీ లనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

గోళ్లను, గోళ్ళ అందాలను ,ఆరోగ్యాన్ని కాపాడడంలో అవిసె గింజలు ఎంతో ఉపకరిస్తాయి. అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే కొవ్వు ఆమ్లాల పరిమాణం పెంచితే .. గోళ్లు పెళుసు బారడం, చిట్లడం , చిన్న చిన్న ముక్కలుగా విరగడం వంటి సమస్యలు చోటు చేసుకోవు. 

వార్ధక్య లక్షణాలను అరికట్టడం... యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు అవిసెలో మెండుగా ఉంటాయి. ఈ సుగుణాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. 

మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా తలెత్తే హాని కారక ప్రభావాలను అవిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. 

చర్మం పై రంధ్రాలు మూసుకుపోకుండా , చర్మం ఎర్ర భారనీయకుండా నివారించడానికి రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె నూనె తీసుకోవాలి. అవిసె గింజల లోని అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు కుంగుబాటు, వార్ధక్య లక్షణాలను అరికట్టడం లో ఎంతగానో ఉపకరిస్తాయి. 

వంటకాలలో....

ఎన్నో పౌష్టిక విలువలు, అపార ఔషధ సుగుణాలు ఉన్న అవిసె గింజలను ఆకు కూరలు , కాయ గూరలు, చేపలతో పాటు ఆహారంలో చేర్చుకోవాలి. ఏ రూపంలో తీసుకున్నా అవిసె గింజలు ఎన్నో కారణాల దృష్ట్యా ఎంతో విలువైనవి.అవిసెలను చట్నిగా, చెక్కీలుగా,లడ్డూలుగా ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఈ గింజలను బెల్లంతో కలిపి చక్కీలు చేసుకోవచ్చు. సలాడ్స్ పై వీటిని చల్లుకోవచ్చు. ఇవి శక్తిని,ఓపికను మెరుగు పరుస్తాయి.

పండ్ల రసాలు,షేక్స్,ఇతర మృదు పానీయాలలో వాడుకోవచ్చు.అవిసెలను కూరలకు, పానీయాలకు చేర్చడం వలన వాటికి అదనపు రుచి వస్తుంది. ఇంట్లో తయారు చేసిన జున్ను,యోగర్ట్ ఇంకా ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు.

వంటకాల తయారీలో అవిసె గింజల లోని పౌష్టిక విలువలు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవిసె నూనెను మీ వంటకాలలో, ఆహార పదార్థాలలో చేర్చుకోండి. అవిసెల వాడకంతో మీ ఆరోగ్యంలో చోటు చేసుకునే అద్భుత ఫలితాలను ,పరిణామాలను గమనించండి .ఆరోగ్యం,ఆయుర్దాయం పెరిగే ప్రయత్నాన్ని ప్రారంభించండి.


30, ఆగస్టు 2026, ఆదివారం

కాసర కాయలు.. మినీ కాకర కాయలు..

 చూడడానికి చిన్న కాకర కాయల మాదిరిగా కనిపిస్తుంటాయి ఈ కాసర కాయలు. తెలుగు రాష్ట్రాల్లో రాయల సీమ ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇది అడవులు , చేల గట్ల వెంబడి సహజంగా పెరిగే ఒక రకమైన అడవి కూర గాయ. కాకర కాయల మాదిరిగా మహా చేదుగా ఉంటాయి. అందువల్ల నూనెలో బాగా వేయించి , ఉప్పు, కారం చల్లి రాగి సంకటి, జొన్న రొట్టెలతో ఇష్టంగా తింటారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయని , యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయని అనంతపురం ఆర్ట్స్ కళాశాల బోటనీ లెక్చరర్ డాక్టర్ రఘు రాములు చెప్పారు. అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో రూ. 300 పలుకుతున్నాయి. ఇవి మార్కెట్ లో ఎల్లప్పుడూ దొరకవు. వానాకాలంలో మాత్రమే అక్కడక్కడా లభిస్తాయి. 



భయం.. ఒక మానసిక సమస్య

 భయ పడడం అన్నది ఒక రకమైన మానసిక స్థితి. ఈ భయం ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ఏ వయసులోనైనా రావచ్చు. అసంకల్పితంగా మన స్మృతిలో ఉన్నప్పుడు కానీ, తెలియని స్థితి లో కానీ హఠాత్తుగా ఏర్పడ్డ భావన మనస్సులో స్థిరపడి ఈ భయాలకు కారణం అవుతున్నది. 

అలాగే పాముని చూసి భయం ఉండవచ్చు. పాము ఏం చేయకపోయినా ఆ భయం వల్ల వచ్చే షాక్ వల్ల ప్రమాదం రావచ్చు. కాలేజీలో చదువుకునే ఓ  అమ్మాయికి తనని అద్దంలో చూసుకోవాలంటే భయమట. ఎందుకంటే మిగతా అమ్మాయిల కన్నా తాను అందంగా ఉండననే సంకుచిత భావం క్రమంగా పెరిగి తనని తాను అద్దంలో చూసుకోవడానికి భయం ఏర్పరచుకుంది. 

ఇది ఒక మానసిక న్యూనతా భావం నుంచి వచ్చిన ఒక రుగ్మత. దీన్ని " ఇసోట్రో ఫోబియా " అంటారు. 

ఈ మధ్య ఒక కాలేజీ అబ్బాయి వచ్చి సార్ నాకు ఇంగ్లీషులో పెద్ద పెద్ద వాక్యాలంటే భయం, చదవలేక పోతున్నాను అన్నాడు. ఇది కూడా మానసిక న్యూనత భావం నుంచి వచ్చిన రుగ్మతే . 

రకరకాల భయాలు..

నిజానికి మనమంతా భయం తోనే పుడతాం. భయం తోనే పెరుగుతాం. తెలియని, రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుని దాన్ని ఆపడం తెలియక మనం పడే మానసిక వేదన ' భయం '. మరో రకంగా చెప్పాలంటే మనల్ని మనం రక్షించుకునే ఒక కవచం లాంటిది ' భయం '.

అది నిజం కాకపోవచ్చు,కానీ ఆ భయంలో ఉన్నప్పుడు మనని ఇతరులు బలవంతంగా ఏదైనా చేయిస్తే ఆ భయం నిజమై ప్రమాదం కావచ్చు. ఉదాహరణకు ఊగుతున్నప్పుడు ఎత్తుకు వెడితే భయం పుడుతుంది. అది అసంకల్పితంగా, స్వభావంగానే వచ్చే భయం. అప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. హాస్యానికైనా అప్పుడు అతన్ని ఎత్తుకు ఊపకూడదు. 

ఆ భయంతో ఏదైనా జరగవచ్చు. అసలు ఈ భయాలకు అర్థం ఏమిటి.. ఏదో ఒక స్థితిలో మనసులో ఏర్పడ్డ భావన వల్ల తెలియని భయం ఏర్పడి అది స్థిరపడి పోయి కలిగే ఒక మానసిక స్థితి. 

ఆ స్థితి ఊహించనంతగా పెరిగి పెద్దదై భయాన్ని మరీ ఉధృతం చేస్తుంది. అది ఎంతవరకు వెడుతుందంటే కొందరు గడ్డిలో నడవటానికి భయ పడతారు. . పాములు ఉంటాయేమోనని. కొంత మంది ఒంటరిగా ఉండటానికి, మరి కొంత మంది వెలుగుని చూసి భయ పడతారు. 

ఇదొక రకమైన విచిత్రమైన మానసిక బలహీనత. గ్రీకు భాష లో ఫోబియా అంటే భయం. మరో విచిత్రమేమిటంటే మనలో చాలా మందికి ఎంతో కొంత ఈ బలహీనత ఉంటుందన్నది నిజం. ఎవరైనా చనిపోతే అక్కడికెళ్లి వచ్చి కొంత సేపు భయంతో ఉండిపోతాం. కొంత మంది నదిలో స్నానం చేస్తే భయ పడతారు. దీన్ని అబూటో ఫోబియా అంటారు. కొంత మంది దయ్యాలున్నాయని భయ పడతారు. 

ఈ శతాబ్దంలో మరో విచిత్రమైన భయాలు పుట్టుకు వస్తున్నాయి. తమ సెల్ ఫోన్లు పోతాయేమోనని. విమానంలో పైకి వెళ్తున్నప్పుడు భయం. కారులో వేగంగా వెడుతుంటే భయం. మన కారు తలుపులు బిగుసుకు పోయాయని భయం. . ఇలాంటి విచిత్రమైన, వాస్తవం కాని భయాలు ఆధునిక సమాజంలో నేడు వస్తున్నాయి. 

ఈ చిన్న చిన్న భయాలు ఆందోళన కలిగించేవి కావు కానీ వీటి వల్ల వచ్చే ఆవేశం, మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల వచ్చే మానసిక స్థితి , దాని వల్ల వచ్చే ప్రవర్తనలో మార్పులు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 

ఈ మధ్య ఒకాయన మరుగు దొడ్డి లో బల్లిని చూసి భయపడి దాంట్లోకి వెళ్ళడం మానేశాడట. అంతే కాదు, ఏ మరుగు దొడ్డి లోకీ వెళ్ళక నాలుగు రోజులకు కడుపు ఉబ్బరించి డాక్టర్ దగ్గరికి వెళ్ళ వలసి వచ్చిందట. బల్లిని, బొద్దింకలను చూసి భయపడి ఆకాశం , భూమిని, గోడలను చూడకుండా కళ్ళు మూసుకునే వారు కూడా ఉన్నారు. దీన్ని అరక్నో ఫోబియా అంటారు. 

చిన్న చిన్న భయాలు ఒక్కొక్కప్పుడు పెద్ద మానసిక సమస్యగా మారి మన జీవన విధానాన్ని భయ కంపితం చేసి బాధ పెట్టవచ్చు. మనలో చాలామందికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాలంటే భయం. పళ్ళు లాగేస్తాడని. 

కొంత మందికి హాస్పిటల్ కి వెళితే తెలియని భయం వల్ల బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయటకు రాగానే తగ్గిపోతుంది. 

దైవ ధ్యానం చేయాలి..

కొంత మంది లో భయం మరోలా ఉంటుంది. ఒక రోగిని చూడడానికి వెళ్ళినపుడో , ఒక ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళినప్పుడో భయం అంతర్లీనంగా వస్తుంది. అప్పుడు తెలీకుండా కళ్లలో నీరు ఆగకుండా వస్తుంది. మాట రాదు, ఇది కొద్ది సేపే ఉంటుంది. 

ఇది ఒక మానసిక బలహీన స్థితి. అలా అని ప్రతీ భయం మానసిక రుగ్మత కానక్కరలేదు. మనో వికృత స్థితి కానక్కరలేదు. కానీ ఈ భయాలను మనం నియంత్రించుకోకపోతే జీవన యానం కుంటు పడుతుంది.

ఆరు బయట కూర్చోవాలంటే భయం.. అగోరో ఫోబియా, స్కూలు కెళ్ళటానికి భయం .. డిడాస్ కటైనో ఫోబియా, మూత్ర విసర్జన కు వెళ్లాలంటే భయం.. యూరో ఫోబియా, పెళ్ళి చేసుకోవడమంటే భయం .. గామో ఫోబియా, పాములంటే భయం.. ఒఫిడియో ఫోబియా, సెల్ ఫోన్లు పోతాయేమోనని భయం.. ఫోబియా ఫోనియా . 

ఈ భయాలు బలహీనతలుగా మారి మనిషిలో శాశ్వత మవుతాయి. కాని తాత్కాలికంగా ఉండి కాల ప్రభావంలో మరుగున పడి పోయి తొలగిపోతాయి. 

అందుకే ఆయుర్వేదంలో ఆచార్యులు సత్వ రజో తమోగుణాలైన మానసిక శక్తులను నియంత్రించి పోషక పరిచే జీవన విధానాన్ని సూచించారు. 

అవేమిటంటే.. ప్రతి వారం, తలకి, వెన్నుపూసకి , పాదాలకు నువ్వుల నూనెతో అభ్యంగనం. అంటే మసాజ్ చేసుకొని తలంటు పోసుకోవడం. మేధో రసాయనాలతో చేయ బడిన చక్కెర పొంగలి , బెల్లంతో చేసిన పాయసం తినడం, ఉదయం, రాత్రి పడుకునే ముందు మనస్సును ఒక్క క్షణమైనా ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానించాలి. 

అపరిశుభ్రమైన , ప్రమాద కరమైన స్థలాల కెళ్ళినపుడు తిరిగి వచ్చిన వెంటనే తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని రెండు చిటికెల జీలకర్ర , కాస్త పసుపు నోట్లో వేసుకోమని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ మానసిక బలహీనతకు కారణమైన వన్నీ తొలగిపోతాయి. 

29, ఆగస్టు 2026, శనివారం

అడవి మామిడి.. ఒక అపురూప వృక్షం

 ఆమ్రాతకం కషాయామామ్లమం బృహత్కంఠకర్షణం 

పక్వం తు మధురాంలాడ్యం స్నిగ్ధం కించిత్ కఫాపహం.

కొండ మామిడి లేదా అడవి మామిడి కాయలను " ఆమ్రాతకం " అనీ , కోశామ్రం అనీ పిలుస్తారు. కొండ అంటే హిమాలయాలనే. ఈ మామిడి కాయలను హిమాలయన్ మామిడి అని కూడా పిలుస్తారు. మన వైపు పండే మామిడిని శాస్త్ర పరంగా " మాంజిఫెరా ఇండికా" అని, హిమాలయాల మామిడిని " మాంజిఫెరా సిల్వాటికా" అని పిలుస్తారు. 

ఈ కాయ చివర కొస దేలి ఉంటుంది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున ఉండే చల్లని ప్రాంతాల్లోనే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. దక్షిణ మధ్య, తూర్పు ఆసియా దేశాల లో , ముఖ్యంగా అసోం, బంగ్లాదేశ్, నేపాల్, కంబోడియా, మయన్మార్, అండమాన్ నికోబార్ దీవుల్లో వీటి వ్యాప్తి ఎక్కువ. 

మన మామిడి లాగానే జూన్,జూలై నెలల్లో ఈ కాయలు చేతికొస్తాయి. పర్యావరణ నిపుణులు ఈ అడవి మామిడి ని అంతరించిపోతున్న వృక్ష జాతులలో చేర్చారు.

పక్వానికి వచ్చినవి దొరికితే వాటిని వదలకండి. పలక బారి కండ పట్టిన కొండ మామిడి ఊరగాయ పచ్చళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు.పచ్చివి,లేతగా ఉన్న పిందెలు వగరు, చేదు,పులుపు కలిగి గొంతు నుస పెడతాయి. పలక బారిన కాయలు బాగా వేడి చేస్తాయి. కానీ, చర్మ వ్యాధులున్న వారికి మేలు చేస్తాయి. పండినవి రుచిగా ఉంటాయి. కఫాన్ని కొద్దిగా తగ్గిస్తాయని " భోజన కుతూహలం " గ్రంథంలో తెలిపారు. 

మనం చెత్త బుట్టలో పడేసే మామిడి టెంకే లోపలి జీడికి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. జీడి లో నుండి కొవ్వు పదార్థాలను వేరు చేస్తున్నారు. మన వైపు పండే మామిడి టెంకే లోని జీడి కన్నా ఈ అడవి మామిడి జీడిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధన లో చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగించే కోకో బటర్ తో సమానమైన కొవ్వు పదార్థం ఈ అడవి మామిడి జీడి నుంచి లభిస్తుందని , ఉత్పాదకత రీత్యా చూసినప్పుడు కోకో మొక్కల గింజల నుండి తీసే కొవ్వు కన్నా ఇది చాలా చవకగా లభిస్తుందనేది ఈ పరిశోధన సారాంశం . బంగ్లాదేశ్,భూటాన్ వంటి దేశాల్లో ఈ అడవి మామిడి ఎక్కువగా పండుతుంది.

28, ఆగస్టు 2026, శుక్రవారం

సహజ సాంత్వన ఇచ్చే.. సహజ నూనెలు

 ప్రకృతి నుంచి లభించే రకరకాల మొక్కల బీర్లు వేర్లు గింజలు, కాండం, పువ్వులనుంచి సేకరించిన నూనెలను అరోమా తైలాలు అంటారు. వీటిలోని మేలు చేసే కొన్ని పదార్థాలు ముక్కు నుండి మెదడుకు చేరి రక్త ప్రసరణ, ఆలోచన కేంద్రాలు , ఊపిరి తిత్తుల మీద పని చేస్తాయి. వీటిలో చెప్పుకో దగినవి నీలగిరి , జాజి తైలాలు. వీటి లోని కొన్ని పదార్థాలు వాతావరణం లోని క్రిములను సంహరించడానికి ఉపయోగపడతాయి. 

నీలగిరి తో నొప్పులు దూరం..

కప్పు నీళ్లలో 6 చుక్కల నూనె కలిపి పుక్కిలిస్తే నోటి పూత, ఫంగల్ ఇన్ఫెక్షన్లు బాధించవు. జ్వరంతో బాధ పడేవారికి చల్లటి నీళ్లలో 6 నుంచి 10 చుక్కల నీలగిరి తైలం వేసి ఒంటిని తడిపితే జ్వరం త్వరగా తగ్గుతుంది. 

జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి బాధిస్తుంటే చేతి రుమాలులో 4 చుక్కలు వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే 6 నుంచి 10 చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి. 

ఫ్లూ జ్వరం ఉన్నవారికి నీళ్లలో 2,3 చుక్కలు వేసి తాగిస్తారు. కండరాల నొప్పి, నరం పట్టుకు పోయినపుడు కొబ్బరి నూనె లో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్య దూరమై హాయిగా ఉంటుంది. 

నల్లులు,పురుగులను నిర్మూలించాలంటే నీలగిరి తైలాన్ని టర్పంటైన్ తైలంలో కలిపి అందులో చిన్న చిన్న కాటన్ ఉండలు వేసి బయటకు తీసి వాటిని మంచాల మూలల్లో, దుస్తుల అల్మారా లో పెడితే వాటి బెడద తగ్గుతుంది. 

నీలగిరి తైలాన్ని తేనె తో కలిపి మొటిమల మీద రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఐతే 6 ఏళ్ల లోపు చిన్నారులకు నోటి ద్వారా ఇవ్వకూడదు. 

హాయి నిద్రకు జాజి నూనె..

మానసిక ఒత్తిడి,ఆందోళనలో ఉన్నవారు వాడితే మంచి గుణం ఉంటుంది.గుండె పనితీరును పెంచుతుంది. ఒంటి నొప్పులతో బాధ పడేవారు కొబ్బరి నూనె తో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

బకెట్ నీళ్లలో కొద్దిగా జాజి నూనె ను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్ర పడుతుంది.మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్ళు తగ్గుతాయి. అలానే నెలసరి సమయంలో కడుపు నొప్పి అనిపిస్తే పొత్తి కడుపు మీద రాస్తే మంచిది.

తలలో పేలు బాధిస్తుంటే కొబ్బరి నూనె లో జాజి తైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు. చెంచా పాల మీగడలో 4 చుక్కలు  చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గు ముఖం పడతాయి.

జాజి తైలం..జాగ్రత్తలు..

ఈ తైలాన్ని కొబ్బరి, ఆలివ్ నూనె,తేనె .. ఏదో ఒక దానితో కలిపి కొంచెం వాడితే మంచి ఫలితం ఇస్తుంది. సుగంధ తైలాల వాడకంలో వీటిని ఇతర నూనెలతో కలిపి వాడుకోవాలి. ఇవి ఘాటైన ద్రవ్యాలు కాబట్టి పరిమితంగా వాడాలి. ఉప్పు,నూనె, ఏదైనా పిండిలో కానీ వేసి వాడుకోవాలి. సుమారు 10 నుండి 12 చుక్కలు మించి వాడకూడదు.

చిన్నారులు, వాసన పడని వారు వీటికి దూరంగా ఉండాలి. ఒక్కో సారి ఈ నూనె వల్ల గర్భ స్రావం అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి గర్భిణులు వాడక పోవడం మేలు. కొందరికి పడక వాంతులు,తలనొప్పి సమస్యలు బాధిస్తాయి . కాబట్టి గమనించి వాడుకోవాలి.


24, ఆగస్టు 2026, సోమవారం

శక్తి దాత.. సీతా ఫలం..

 సీతా ఫలం అనగానే తీయని మృదువైన గుజ్జు గుర్తుకు వస్తుంది. దీని లోపలి గుజ్జు కస్టర్డ్ లా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని ఇంగ్లీష్ లో కస్టర్డ్ ఆపిల్ అని పిలుస్తారు. 

భోజన కుతూహలం గ్రంథంలో సీతా ఫలం గుజ్జును తియ్యని, చలవ చేసేదిగా , పైత్య దోషాలను తగ్గించేదిగా పేర్కొన్నారు. 

సీతా ఫలం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

అన్నం సహించక, నోటికి రుచి తెలియని వారికి సీతా ఫలం రుచిని కలిగిస్తుంది. ఇది తినటం వలన ఎక్కువ కఫం పెరగదు. 

మిగల ముగ్గిన సీతా ఫలం లో సహజ చక్కెరలతో పాటు పిండి పదార్థాలు , పీచు, విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. వీటి వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. పీచు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. 

సీతా ఫలం పచ్చి కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.అతిసారం , నీళ్ల విరోచనం తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు. 

కొన్ని ప్రాంతాలలో పచ్చి కాయను బాగా ఎండబెట్టి దానిని పొడిగా దంచుతారు. చర్మ సమస్యలకు ఈ పొడి మంచి మందుగా పనిచేస్తుంది. 

సీతా ఫలం గింజలు నల్లగా మెరుస్తూ ఉంటాయి.అందుకే ఈ మొక్కకు " కృష్ణ బీజ" అనే పేరు కూడా వచ్చింది. ఇవి తినడానికి పనికి రావు. కానీ సంప్రదాయ వైద్యంలో ఈ గింజల పొడి ని చుండ్రు తగ్గించడానికి , పేలను తొలగించడానికి వాడతారు. 

సీతా ఫలం వేడి శరీర తత్వం ఉన్న వారికి చలవనిస్తుంది. దీనికి పిత్త వికారాలు, దాహం, మంట వంటి వాటిని శాంతింప చేసే గుణం ఉంది. 

సీతా ఫలాలు ఎక్కువగా తినటం మంచిది కాదు.ముఖ్యంగా మధుమేహం , స్థూల కాయం ఉన్న వారు వీటిని మితంగా తింటేనే మంచిది. 

16, ఆగస్టు 2026, ఆదివారం

సొర ఆకుల కూర.. ఆయుర్వేదం

 ఆనప్పాదు అనేది తెలుగులో ఒక అందమైన పద బంధము. శాక రాజము అనదగిన సొర కాయకు ఇది ఒక పర్యాయ పదం. ఆహార కొరతను తీర్చే ఒక ప్రకృతి వర ప్రసాదం కూడా ఇంటి పైకాపు మీదకి సురతీగ పాకి పైనుంచి కాయ ఒకటి తెగి జారీ వచ్చి కింద ఉన్న మేక నెత్తిన పడిందట పుటుక్కు జరజర డుబుక్కుమే అని జానపదలు సరదాగా చెప్పుకుంటున్నారు దీనిని. 

రావి కొండల రావు గారు అనప్పాదు గురించి తెలుగు మీస్టారి పాత్రలో సైలెన్స్ అంటూ చేసిన కామెడీ పాత తరానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. పొడవుగా ఉండే వాటిని సొరకాయలని, గుండ్రంగా చిన్న కుండలా ఉండే వాటిని ఆనప కాయలు అని అంటారని కొందరు చెప్తారు. కానీ సొర, ఆనబ అని రెండింటిని పిలుస్తుంటారు. తుంబీ , కుంభ తుంబీ అని సంస్కృతంలో పిలుస్తారు వీటిని.

మనకు సొరకాయ వాడకం గురించి వేద కాలము కన్నా ముందు నుండే తెలుసు. 2024లో అమెరికాలోని కార్నల్ విశ్వవిద్యాలయంలో 197 రకాల సొరకాయల జన్యువు లను పరిశీలించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో సుమారు 12000 సంవత్సరాల క్రితం పుట్టి అక్కడినుండి ఆసియా, అమెరికా ఖండాలకు సొరకాయ మొక్క వ్యాపించింది అని తేల్చారు. 

సొర మొక్క కాయగూరే కాదు, ఆకుకూర కూడా. వాన కాలంలోనూ, ఆ తర్వాత వచ్చే కార్తీకమాసం ఆహార కరువు కాలంలోనూ పూర్వం మనవాళ్లు ఈ అనబ ఆకులను కూరగా వండుకొని కమ్మగా తినేవారు. తినటానికి పనికొచ్చేది ,పోషకాలను కలిగి పుష్టి, రుచిని కూడా ఇచ్చేది అయినప్పుడు దానిని తినడానికి మనకు నామోషీ ఎందుకు..

ఆనబ ఆకులను సన్నగా తరిగి, ఒక బాండీలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి నీళ్ల మూత పెట్టి మగ్గనిచ్చి ఉల్లి ముక్కలు వగైరా చేర్చి దానిపైన కొంచెం పెరుగు, కొద్దిగా చింతపండు రసం ,కాసింత మినప పిండి కొద్దిగా పొడి బెల్లం కలిపి నెయ్యి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మెంతులు, ఆవాలు ,జీలకర్ర ,నువ్వు, మినప్పప్పు లాంటివి విడివిడిగా వేయించి మెత్తగా దంచిన పొడిని తగినంతగా ఈ కూరలో కలిపి బాగా మగ్గనివ్వాలి. చివరలో ఇంగువ తాలింపు పెడితే సొర ఆకుల కమ్మని కూర సిద్ధం అయినట్లే. సోరలాంటి తీయ కూరలను అనవసరమైన మసాలాలు, అధికంగా చింతపండు రసాలు కలపకుండా తీపి, పులుపు, ఉప్పు ,కారం ,వగరు, చేదు ఆరు రుచులు ఉండేలాగా నలుడు చెప్పిన విధానం ఇది. 

పాలకూరతో చేసుకున్నట్లే పప్పు ,పులుసు కూర, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. పాలక్ లాంటివి గాని, పకోడీలు, పరోటాలు గాని వండుకోవచ్చు. బచ్చలాకు లాగా, జిగురు తోటకూర లాగా వగరు ఉండవు కాబట్టి సోరాకులతో అన్నీ వండుకోవచ్చు. కంద- బచ్చలి లాగానే ఆవపెట్టిన కూర బాగుంటుంది .సోరాకుల సలాడ్ తింటే ఎసిడిటీ ,కడుపులో మంట ,ఇరిటేషన్లు తగ్గుతాయి. 

చింతపండు వేయకుండా పెసర లేదా కందిపప్పుతో కాచిన కట్టులు, సన్నగా తరిగిన సొర ముక్కలను, సొర ఆకులను కూడా కలిపి కాచిన పప్పుచారు లేదా సూపు పొట్టకు మేలు చేస్తుంది. సొర ఆకులను జ్యూస్  తీసి అందులో చారు పొడి వేసి కాచిన చారు చాలా రుచికరంగాను జీర్ణశక్తిని పెంచేదిగాను ఉంటుంది. 

సొరకాయ కున్న గుణాలన్నీ సొర ఆకులకు ఉన్నాయి. ఈ ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉన్నాయి. ఖనిజ లోపాలతో బాధపడే వారికి ఈ ఆకులు వరప్రసాదం అని చెప్పవచ్చు. అమితంగా చలవ చేస్తాయి, శరీరానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి .

పశ్చిమ బెంగాల్లో దీపావళికి ముందు జరిగే భూత చతుర్దశి సందర్భంగా చేసే చద్దోశాక్ అనే సంప్రదాయ వంటకంలో 14 రకాల ఆకుకూరలతో పాటు సొర ఆకును కూడా తప్పనిసరిగా కలుపుతారు. సొరాకు ముదిరే కొద్దీ దానిమీద నూగు, ముల్లలాంటి రోమాలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం పెద్ద పని అందుకని బాగా లేత ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. ఎండ పడే చోట కుండీలో  సొర విత్తులు నాలుగు పాతండి  చాలు, వారానికి ఒకటి రెండు సార్లు మీ ఇంటిల్లిపాది సొర ఆకులను కమ్మగా వండుకుని తినవచ్చు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...