డెంగీ తదితర వ్యాధుల విషయంలో అనవసరంగా యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మందులు ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డెంగీ అని నిర్ధారణ కాకుంటే జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నా ' పారాసిటామల్ ' మందు తీసుకుంటే సరిపోతుంది.
డెంగీ, డెంగీ ని పోలిన విష జ్వరాల చికిత్సలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు.
డెంగీ లక్షణాలు..
తలనొప్పి ,కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పులు ,శరీరంపై దద్దుర్లు, ముక్కు,చిగుర్లు, నోటి నుండి రక్తం కారడం ,వాంతులు కావడం, మలం నల్లగా ఉండడం, నిద్రలేమి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నాలుక తడి ఆరిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి లక్షణాలతో జ్వరతీవ్రత ఉంటే వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు వైద్య పరీక్షలు చేయించాలి. రక్త కణాల సంఖ్య 80000 కంటే తగ్గితే వైద్యుల పర్యవేక్షణలో తప్పకుండా చికిత్స చేయించాలి. రోగికి రక్తపోటును వైద్య సిబ్బంది నిరంతరం గమనిస్తూ ఉండాలి. రక్త కణాల సంఖ్య 40 వేల కంటే తగ్గితే ప్రతి గంటకు ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ, రక్త కణాల సంఖ్య ఇంకా తగ్గుతూ ఉంటే డెంగీ నిర్ధారణ కోసం" ఎలిసా " పరీక్ష చేయించాలి .ఈ పరీక్ష లో పాజిటివ్గా నిర్ధారణ అయితే డెంగ్యూ చికిత్స ప్రారంభించాలి.
చికిత్స విధానాలు..
డెంగీ నిర్ధారణ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రతి గంటకు సమీక్షిస్తూ ..సెలైన్ ( ఐసోటోనిక్ క్రిష్టలాయిడ్ సొల్యూషన్ )ఇవ్వాలి.
రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే ఈ క్రిస్టలాయిడ్ సొల్యూషన్ స్థానంలో డెక్స్ట్రాన్ / ప్లాస్మా ఎక్కించాలి.
రక్తస్రావం ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే సెలైన్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు రక్తం కూడా ఎక్కించాలి. అవసరమైతే కృత్రిమ శ్వాస కూడా అందించాలి
రోగి కోలుకుంటున్నట్లు కనిపిస్తే సెలైన్ మోతాదు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి .
డెంగీ నిర్ధారణ కాకున్నా రక్తస్రావం అవుతుంటే రక్తం ఎక్కించాలి.
చేయకూడనివి..
రోగికి కండరాలు ,ఒళ్ళు నొప్పుల నివారణకు ఆస్ప్రిన్, బ్రూఫిన్ లాంటివి ఇవ్వ కూడదు.
డెంగ్యూ తరహా లక్షణాలు నిర్ధారణ కాకుంటే నరాల ద్వారా సెలైన్ వంటివి కూడా ఇవ్వకూడదు.
యాంటీబయాటిక్ మందులు అసలు వాడకూడదు.
రోగికి భరించలేని స్థాయిలో నొప్పులు ఉన్నా ఉపశమనం కోసం స్టిరాయిడ్స్ ఇవ్వకూడదు.
రోగికి సెలైన్ ఒకే వేగం /మోతాదుతో ఎక్కించాలి. మోతాదును పెంచడం ,తగ్గించడం వీలైనంత వరకు చేయకూడదు .
ఉపశమనం లక్షణాలు..
రోగినాడీ తీరు ,శ్వాస తీరు, రక్తపోటు నిలకడగా ఉండడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి రావడం, రక్తస్రావం, వాంతులు లేకపోవడం ,మూత్రం బాగా వస్తూ ఉండాలి.
ఈ లక్షణాలు ఉంటే మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని, డిశ్చార్జ్ చేసేముందు ఒకసారి రక్త కణాల సంఖ్య పరీక్షించాలి .ఇందులో 50 వేల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఇక ఎలాంటి అపాయము ఉండదు .
డెంగీ నిర్ధారణ కాకపోతే చికిత్స..
జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటూ, కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నా .. డెంగీ కాదు. ఇలాంటి జ్వరాలకు పేరాసిటమాల్ మాత్రలు రోజుకు గరిష్టంగా నాలుగు సార్లు తీసుకుంటే సరిపోతుంది.
జ్వరం రెండు రోజులకు తగ్గకపోతే నిపుణుల సూచనల మేరకు పారాసెటమాల్ మందును కొనసాగించాలి.
జ్వరం ఉన్నా తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవచ్చు .
దీనికి అదనంగా సూపు ,పాలు ,పండ్ల రసాలు ,కొబ్బరి నీళ్లు, నీరు ఎక్కువగా తీసుకోవాలి .
రోగి ఎలాంటి శారీరక శ్రమకు గురికాకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి .
పారాసెటమాల్ మందు మోతాదు ఇలా
ఏడాదిలోపు వయసు వారికి 60 మిల్లీ గ్రాములు, ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల వరికి 60 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు, ఐదు సంవత్సరాల కు పైబడి వయసు ఉంటే రెండు వందల నలభై మిల్లీ గ్రాములు ఇవ్వాలి.