20, సెప్టెంబర్ 2026, ఆదివారం

జామకాయ.. సామాన్యుల అద్భుత పోషకాహారం

 ఆసేతు హిమాచలం ప్రతి గ్రామంలో,  పట్టణ వీధుల్లో విరివిగా దొరికే మంచి ఆహారం, అందుబాటులో ఉండే పోషకాహారం జామకాయ.. ఇది అడవుల్లోనే కాకుండా పల్లెల్లోనూ పట్టణాలలో తినే తియ్యటి ఆహారమే కాదు, కొంత మంది కి మందు కూడా.. 

అనన్యమైన పోషక విలువలు,అద్భుతమైన వైద్య లక్షణాలు కలిగినటువంటి సామాన్యుని ఆపిల్ తియ్యనైన జామకాయ. 

గుర్వా అని పిలవబడే ఈ జామకాయ సంప్రదాయంగా ఎన్నో యుగాల నుండి ఆహారంగానూ, ఓషధి గానూ గుర్తించబడింది. ప్రపంచమంతటా జరిగిన వివిధ పరిశోధనలు దీనిలో పోషక విలువలే కాకుండా రోగ నివారణ శక్తిని కూడా కలిగి ఉందని ధృవీకరించాయి. 

ముఖ్యంగా మన దేశంలో, మిగతా ఆసియా దేశాల్లో విరివిగా పెంచబడుతున్న ఈ జామ పచ్చగా ఉండే గుండ్రని గుండె కాయ లాంటి పండు. పూర్తిగా పండాక పసుపు పచ్చని రంగులో నిగనిగలాడుతుంది. 

జామ కాయలో ఎన్నో విటమిన్లు , మినరల్స్ తో పాటు మంచి పీచు పదార్థం ఉంది. ఇందులో ఉన్న ప్రత్యేక విటమిన్ వల్ల శుక్ర బీజం బలహీనంగా ఉన్న పురుషులకు ఇది తినడం చాలా మంచిది. 

జామ ఆకులకు పుండు,గాయం మాన్ప గలిగిన శక్తి ఉంది.ఏదైనా గాయమైనప్పుడో , రోడ్డుపై ఏదైనా గీసుకుంటేనో ఏమీ దొరకనప్పుడు జామ ఆకుల పసరు పూయండి. అది తాత్కాలిక చికిత్స. 

మంచి హితకారిణి..

జామలో రక్తాన్ని గడ్డ కట్టించే శక్తి ఉంది.ముక్కులోంచి , చిగుళ్ల నుంచి రక్తం స్రవించే వ్యాధి ఉన్నవారు జామకాయ తినడం, జామాకు పొడితో చిగుళ్ళను సున్నితంగా మర్దన చేసుకోవడం మంచిది. 

తరచూ జిగట విరేచనాలు అవుతున్న వారు జామ తింటే ఇందులో ఉన్న శక్తి కారణంగా చిన్న ప్రేవులలో క్రిమిని అడ్డగించి , జిగురు పదార్థాన్ని తొలగిస్తుంది. 

జామలో ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి వల్ల పెద్ద వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు , తరచూ మరచిపోవడం వంటివి తగ్గుతాయి. అందుకే అరవై ఏళ్ళు పైబడిన వారు కొంచెం ఉప్పు రాసిన జామ కాయ ముక్కలను తినడం హితకరం. 

ఉత్తర భారతంలోనూ, పశ్చిమ తీరాన రోజూ విరేచనం కాకపోతే రాత్రి జామపండుతో చేసిన మురబ్బా తింటారు. జామ తరచూ తినడం వల్ల జీర్ణాశయం శక్తిని పుంజుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను పెంచే పదార్థం లేదు. 

పచ్చి జామ కాయలు,లేత జామ ఆకులు కాచి తయారు చేసిన నీటితో స్నానం చేస్తూ దోర జామ కాయలు తింటుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. 

జామ కాయలు, ఆకుల కషాయం, శొంఠి,పసుపు కలిపి తీసుకుంటే ఎప్పుడూ బాధించే దగ్గు , జలుబు తగ్గుతాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో జామ పండ్లు తినే వారిలో క్యాన్సర్ తక్కువగా వస్తుందని తేలింది. 

జామ పండు. ఆస్తమా,మూర్ఛ, తల తిరగడం , రక్త పోటు, అధిక బరువు కలిగి ఉండటం , ఏ కారణం చేతనైనా శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం , చిగుళ్ళు వాయటం వంటి వాటిలో చాలా ఉపయుక్తం. దీంతో సహజమైన మందులు తయారు చేయవచ్చు. అందుకు ప్రయత్నాలు, పరిశోధనలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ రోజులు ఆగకుండా ఉండే ఋతు స్రావానికి జామ చక్కటి మందుగా గుర్తించ బడింది. 

జామకాయలో పోషక విలువలు అపారం.అందుకే జామను సామాన్యుని నిండు ఆహారం అంటారు. ఇందులో కాల్షియం 50 mg, కార్బోహైడ్రేట్స్ 20 mg, ఫైబర్ 8.9 gm, ప్రోటీన్, విటమిన్ సి ల వంటివి ఉన్నాయి. ఇందులో కొవ్వు పదార్థం 0.9 gm మాత్రం ఉండటం వల్ల ఒళ్ళు పెరగదు. అందుకే దీన్ని అందరూ ఆప్యాయంగా తినవచ్చు. 

బాగా పండిన జామ పండ్లు అలాగే తినవచ్చు లేదా జామ్ లు, జెల్లీ ల రసం పానీయాల రూపం గానూ తీసుకోవచ్చు.ఉత్తర దేశాలలో జామ పళ్లతో చేసిన జెల్లీ లు పిల్లలు, పెద్దలు మంచి ఆహారం గా వాడతారు. 

పూర్వం జామ ఆకుల రసం విరేచనాలు అరికట్టడంలో మంచి ఫలితాలు ఇచ్చేదని , పిల్లలకు కూడా ఇవ్వ వచ్చునని భావించే వారు. ప్రపంచమంతా వివిధ పరిశోధనలలో శాస్త్రజ్ఞులు దీనిపై విశిష్ట పరిశోధనలు జరుపుతున్నారు. 

కాళ్లు లాగుతుంటే చాలా బాధ పడతాం.సాయంత్రం అయ్యేసరికి మోకాళ్ళ కింద పిక్కలు లాగుతున్నప్పుడు పిల్లల చేత నొక్కించుకుంటాం. ఎన్ని నొప్పి మాత్రలు వేసుకున్నా ఫలితం ఉండదు. అటువంటప్పుడు పది, పది హేను జామ ఆకులు ఒక కప్పు నీళ్లలో వేసి 20 నిమిషాలు కాచి వడపోయండి. ఆ నీళ్ళు రోజూ మూడు సార్లు తాగండి. పూర్తిగా తగ్గిపోతుంది. 

ప్రకృతి ప్రసాదం..

క్రీడా కారుల్లో ముఖ్యంగా టెన్నిస్ ఆటగాళ్లలో మోచేయి నొప్పి ఎక్కువగా ఉంటుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. దానికి కూడా ఈ జామ ఆకులతో తయారు చేసిన టీ అద్భుత నివారిణి. 

నోటి చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటే జామ ముక్కలపై ఉప్పు రాసుకుని కొంచెం కొంచెం కొరుకుతూ తినండి. ఎంతో ఉపకరిస్తుంది. 

జామ చెట్టు బెరడు,ఆకులు,కాయలు,పండ్లు అన్నీ కూడా జీర్ణాశయం పై చక్కటి ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా నేటి సామాన్య వ్యాధి gastro enterities  అనబడే గృహాణి లో జామ ప్రభావం మంచి ఫలితాలు సూచిస్తుంది. 

అలాగే దానిమ్మ రసం,దానిమ్మ బెరడు చూర్ణం, జామ రసం జిగట విరేచనాలు నివారించడంలో  మంచి ఫలితాన్ని ఇస్తాయి. సామాన్యంగా అందుబాటులో దొరికే జామ కాయ ముక్కలు ఉప్పు అద్దుకుని కానీ, పండు ముక్కలు తినటం కానీ అందరికీ మంచిది. 

షుగరు వ్యాధి ఉన్నవారు దోర జామ కాయలు తినడం మంచిది.జీవనానికి జవసత్వాలు , జీర్ణాశయానికి జీర్ణ శక్తిని ఇచ్చేటువంటి అద్భుత ప్రకృతి ప్రసాదం జామ కాయ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

19, సెప్టెంబర్ 2026, శనివారం

సొరియాసిస్ వ్యాధికి .. ఆయుర్వేద పరిష్కారాలు.

 పొట్ట మీద, తొడల పైన, చంకల దగ్గర కాళ్ళు చేతుల పైన ఎర్రని పెద్ద పెద్ద మచ్చలు , విపరీతమైన మంట, దురద , తల దువ్వుకుంటే తెల్లని పొట్టు రాలుతూ ఉంటుంది. చూసుకుంటున్న తనకు, చూస్తున్న ఇతరులకు ఒక రకమైన విచారం.. అదే " సొరియాసిస్ ". ఇది మగవారిలోనే కాదు, స్త్రీలలో కూడా రావచ్చు. దురదృష్టమేమిటంటే ఇది ఆరంభంలో ఏదో చిన్న చర్మ వ్యాధి అని అశ్రద్ధ చేయడం వల్ల పెరుగుతుంది. పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు.

కారణమేమంటే ఇంతవరకూ జరిగిన పరిశోధనల వల్ల వ్యాధి కారణమే పూర్తి అవగాహనకు రాలేదు. క్రిమి వల్ల కాదు, రక్తం చెడిపోయి కాదు, వైరస్ వల్ల కాదు , అంటువ్యాధి కాదు. కానీ కొన్ని కుటుంబాలలో ఇది వస్తుంది. 

చర్మం పై ఉన్న కణాల్లో తెలియని తీవ్రమైన మార్పు ఈ వ్యాధికి కారణమని అంతర్జాతీయంగా విశ్వసించ బడుతోంది. ఈ వ్యాధి నెమ్మదిగా ప్రారంభమైనా తొందరగానే తీవ్ర స్థితికి చేరుతుంది. 

ఇది ఏదో అసాధారణమైన వ్యాధి కాదు,సామాన్యమైన చర్మ వ్యాధి. మోకాళ్ళ పైన, మోచేతుల పైన , చంకల్లో, గజ్జల్లో, ఎర్రటి పెద్ద మెరుస్తున్న మచ్చలు ఏర్పడి తెల్లటి ద్రవంతో కారుతూ , ఎండిన ఆ తెల్లటి పొడి పొట్టులా రాలుతూ ఉబ్బి, మంట, నొప్పి, దురదలతో ఉంటుంది. 

వంశ పారంపర్యమే కానీ..

తలపైన ముఖ్యంగా తల మధ్య భాగంలోను, తొడల పైన బొడ్డు చుట్టూ పొట్ట భాగంలో ఇవి ఏర్పడతాయి తర్వాత చాతి పైన ముఖం పైన వ్యాపిస్తాయి. 

బాధలు రాత్రిపూట ఈ ఎండాకాలంలోనూ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా guttate  అనే  సొరియాసిస్ వ్యాధి పిల్లల్లో వస్తుంది. అది చీము, వాపులతో కూడుకుని మరీ బాధ పెడుతుంది. మరో ముఖ్య విశేషమేమంటే ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు. 

వంశ పారంపర్యము కానీ , కాల మాన పరిస్థితులు కాని, దేశ నైసర్గిక వైరుధ్యాలు కానీ , పరిసరాల కాలుష్యం కానీ ఈ చర్మ వ్యాధికి కారణం కావు. లావుగా ఉన్న వారిలో ఇది మరీ బాధ పెడుతుంది. 

ముఖ్యంగా చంకల్లోనూ, రొమ్ముల పైన వస్తే అది సామాన్యమైన చికిత్సకు కూడా తగ్గినట్లు కనిపించదు. Plaque psoriasis, guttate psoriasis, pustular psoriasis, inverse psoriasis, erythro dermic psoriasis అని ఈ వ్యాధి ఐదు రకాలుగా ఉంటుంది. 

తలలో దురద,మంట,జుట్టు రాలిపోవడం , ఒళ్ళంతా గాయాలు, అందులోంచి నీరు కారడం , చేప పై పొట్టు లాగా పొట్టు రాలడం. గోరు చుట్టూ, మోకాళ్ళు, మోచేతుల నొప్పి, అర చేతిలో, అరి కాళ్ళలో పగుళ్లు. చర్మం లేచి పోవడం, ఒక్కొక్కప్పుడు జ్వరం గాలి తగిలినా, చెమట పట్టినా మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. 

మరో విశేషం ఏమిటంటే అందరిలో అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు.కొన్ని ప్రస్ఫుటంగా ఉంటాయి . మరో దురదృష్టం ఏమిటంటే రక్త పరీక్షలలోనూ ఎక్కడా చెడు కనిపించదు. ఏ కారణం కనిపించదు. నిండు ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తే విపరీత పరిణామాలు చూపిస్తుంది. మరో విశేషం.. ఇది అంటువ్యాధి కాదు. 

ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళ పిల్లలకు ఈ వ్యాధి రాదు. గర్భిణీ కాలంలో ఈ వ్యాధి ఉండడం వల్ల శిశువుకు కానీ ఆమె ఆరోగ్యానికి కానీ పెద్ద హాని ఉండదు. 

ఆయుర్వేద రీత్యా ఇది ఆగంతుక వ్యాధి.అంటే ఏ కారణం లేకుండా హఠాత్తుగా వచ్చే వ్యాధి. విసర్ప వ్యాధులలో తీవ్రమైన విసర్ప వ్యాధిగా దీన్ని భావించవచ్చు. 

శరీరంలో పిత్త శక్తి దూషించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.మిగతా వాత, కఫ శక్తులు కూడా ఈ వ్యాధిలో దూషించ బడతాయి. చర్మం, రక్తం, లసిక మాంసం .. ఈ ధాతువులు చెడడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. 

ఇది కష్ట సాధ్యమైనది కనుక పూర్తిగా తగ్గదు.కానీ మంచి ఉపశమనం ఇచ్చే చక్కటి చికిత్సలు ఆయుర్వేదంలో ప్రతిపాదించ బడ్డాయి. పసుపు కలిపిన నెయ్యి, వేపాకుతో కాచిన నీటితో స్నానం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రతి రోజూ చేయవలసిన ప్రక్రియలు. 

ఉపశమన చికిత్సలు..

ఈ వ్యాధి ఉన్న వారు ఎక్కువ పులుపు, శెనగ పిండితో చేసిన వస్తువులు , వేరు శనగ నూనె, వంకాయ, కోడి మాంసం, గుడ్డు, చేప, పీతలు , పుట్ట గొడుగులు తీసుకోకూడదు. నువ్వులు, మినుములు, ఉలవలు , వెల్లుల్లి తగ్గించడం మంచిది. 

వ్యాధి హరణ రసాయనం శారీభాద్యాసవం , చంద్రనాసవం,మంజిష్ట, హరిద్రాకల్పం , వంటి చక్కటి మందులు ఉన్నాయి. శరీరాన్ని శుద్ధి పరిచే శోధన చికిత్సలు , పంచ కర్మ చికిత్సలు చాలా ఉపకరిస్తాయి. ఈ చికిత్సలో అంతర్ శుద్ధి చేసి చర్మ కణాలను జాగృత పరిచే మందులతో  శమన చికిత్స చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. 

ఆయుర్వేదంలో ఈ సొరియాసిస్ పై అనేక ద్రవ్యాలు , వాటి ఉపయోగాలు ప్రస్తావించబడ్డాయి. దేశ విదేశాల్లో,కేరళ, వారణాసి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. 

హరిద్ర ఆమ్లకి, విష్ణు క్రాంత, గోక్షుర , తులసి, గుడూచి, పిప్పలి వంటివి వివిధ పరిమాణాల్లో తయారు చేస్తే చక్కని ఫలితాలు ఉన్నాయని గుర్తించబడింది. 

ప్రశాంతతే నివారణ..

ఇవి వ్యాధి మీద సూటిగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల సొరియాసిస్ లో వచ్చే చీము , నీరు చేరడం, ఎలర్జీ, వాటి వల్ల వచ్చే జ్వరం, నొప్పి తగ్గడానికి చాలా ఉపకరిస్తుంది. తులసి, చిత్రకం ఎలర్జీని తగ్గించే శక్తి గలవని అనేక పరిశోధనల్లో గుర్తించబడింది. 

చర్మం పై వచ్చే ప్రతీ పెద్ద మచ్చని సొరియాసిస్ అనుకోకూడదు.చిరకాలం నుండి ఉండి ఏ కారణం లేకుండా ఎర్రగా ఉండి తెల్లని పొట్టు రాలుతుంటేనే సొరియాసిస్ అని అనుకోవాలి. ఇది సాంక్రమిక వ్యాధి కాదు. ప్రమాదాన్ని కలిగించే వ్యాధి కాదు. ఒకరి తువాలు, దువ్వెన లాంటివి వాడడం వల్ల మరొకరికి ఇది వ్యాపించదు. ఇది తగ్గడానికి మందులతో పాటు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఈ వ్యాధి మనశ్శరీరాలకు సంబంధించినది. 

మీ ఆహారంలో పులుపు,సెనగ పిండి, వేరు శనగ నూనె , మసాలా వస్తువులు తగ్గించుకుంటే ఈ బాధలు తగ్గుతాయి. మంచి గంధం పొడి, వేప పొడి కలిపి పైన రాసుకోవడం హితకరం. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉండడం సహజం . వాటికి విచారించేకన్నా, నయం చేసుకుని జీవితాన్ని ఆనంద మయంగా చేసుకోవాలి. 

అల్లం, శొంఠి.. అమోఘం..

 ఆయుర్వేదంలో అల్లం వినియోగం ఎక్కువ. కొందరు దాన్ని అలాగే తినడానికి ఇష్ట పడతారు. అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెడితే శొంఠి గా మారుతుంది. ఆమ్ల గుణం ఉండే శొంఠిలో పీచు పదార్థాలు , ఘాటైన ద్రవ్యాలు వేడిగా మారి శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. 

కొబ్బరి నీటిలో అల్లం రసం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో మంట కలుగదు. భోజనానంతరం చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగదు. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. అరగ్లాసు పాలలో అల్లం, పుదీనా రసం సమ పాళ్ళలో కలిపి తాగితే కడుపులో మంట సమస్య పరిష్కారమవుతుంది. అదే మాంసాహారం అరగక ఇబ్బంది పడుతుంటే పాలకు బదులు కొద్దిగా నిమ్మ రసం చేర్చితే సరిపోతుంది. 

చెంచా అల్లం రసం లో పావు చెంచా జీలకర్ర,తేనె కలిపి తీసుకుంటే తల తిరగడం , పైత్యం , వికారం వల్ల అయ్యే వాంతులు , దురద, కాలేయ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. నెలసరి నొప్పితో బాధపడే వారు పది రోజుల ముందు నుంచి వేడి నీటిలో అల్లం రసం వేసి తీసుకోవాలి. 

గొంతు ఇన్ఫెక్షన్ , నోటి పూత ఉన్నవారు బియ్యం కడిగిన నీటితో అల్లం రసం, తేనె కలిపి తాగాలి. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ ఉన్నవారు ఈ రసంలో మెంతి కూర, తులసి రసం, తేనె కలిపి ఇస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది. 

శొంఠితో సమస్యలు దూరం ఇలా..

కఫం,ఎక్కిళ్ళు,గొంతునొప్పి,ఉన్నవారు గోరువెచ్చని నీటితో శొంఠి పొడి వేసి తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో చిటికెడు శొంఠి పొడి , సైంధవ లవణం వేసి తీసుకుంటే అజీర్ణ సమస్య బాధించదు. 

బరువు తగ్గాలనుకునే వారు దీన్ని పిప్పళ్ల చూర్ణంతో సమానంగా కలిపి రోజూ తేనెతో తీసుకోవాలి. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠి పొడి నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి పాలు పడతాయి. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దలో శొంఠి పొడి నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది. 

నెలసరి సమస్యలు ఉన్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. 

కొబ్బరి నూనెలో ఈ పొడిని కలిపి పూతలా రాస్తే కీళ్ళు, మడమల నొప్పికి పరిష్కారం లభిస్తుంది. 

జాగ్రత్తలు..

రక్త పోటు, కాళ్ళు చేతుల నొప్పులు , నెత్తురు త్వరగా పలచబడే వారు వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోవాలి. వేడి వాతావరణం ఉంటే కొబ్బరి నీళ్లు లేదా చందనంతో కలిపి వాడుకోవచ్చు. అల్లాన్ని ఇతర మసాలా దినుసులతో కలిపి వాడితే దాని గుణం మారి కడుపులో మంట, అజీర్ణం , మల బద్ధకం వంటివి బాధిస్తాయి. 

దీనికి మజ్జిగ ,వెన్న ,తేనె విరుగుడుగా పని చేస్తాయి.

అపోహలు.. వాస్తవాలు..

 1. ) అపోహ.. 

గ్రీన్ టీ ప్రతి రోజూ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.. 

వాస్తవం..

ప్రత్యేకంగా గ్రీన్ టీ తీసుకుంటేనే బరువు తగ్గుతారనే దానిలో వాస్తవం లేదు.ఐతే క్రమ పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ ,వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తూ ఈ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లభించే గ్రీన్ టీ శరీరానికి మేలు చేస్తుంది.

2.) అపోహ..

అల్పాహారం మానేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది..

వాస్తవం..

ప్రతి రోజూ అల్పాహారం తీసుకోని వారికంటే తీసుకున్నవారే త్వరగా బరువు తగ్గుతారని చాలా అధ్యయనాలు రుజువు చేశాయి.ఎలాగంటే ఉదయాన్నే ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ చురుగ్గా జరుగుతుంది. పనులు చేసుకోవడానికి శరీరం ఉత్సాహంగా సహకరిస్తుంది.దాంతో త్వరగా కెలోరీలు ఖర్చవుతాయి కూడా .

3.) అపోహ..

ఆలస్యంగా భోజనం చేసినా బరువు పెరగం..

వాస్తవం..

ఎప్పుడైనా ఆలస్యంగా చేసే పనులు ఆరోగ్యానికి అంత  మంచిది కాదు.దినచర్య పాటించడం దగ్గర నుంచి రాత్రి పూట నిద్రించే వరకు ప్రతి పనిని క్రమ పద్ధతిలో చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు.

అందులో భాగంగా నూనె పదార్థాలు , మసాలా తో చేసిన ఘాటైన వంటకాలు లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని ఆలస్యంగా కాకుండా ముందుగా తీసుకుంటే మంచిది.లేదంటే బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు.



18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జిలకర.. నమలండి కరకర..

 వంటింటి పోపు సామానులలో జిలకర తప్పని సరిగా ఉంటుంది. ఇది విరేచన కారి, జీర్ణకారి, మంచి సువాసన దీని నుండి వస్తుంది. 

ప్రసవం తర్వాత తల్లికి పాలు ఎక్కువగా పడడానికి తెల్ల జీలకర్రను బెల్లం తో కలిపి తినాలి. 

మూత్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి జిలకర పొడి ని చక్కెర తో కలిపి తినాలి.అజీర్ణం,గ్యాస్, కడుపు నొప్పి, అరుచి ,వాంతులు ,ప్రేవులలో పురుగులు పోవడానికి జీలకర్రను వేయించి పొడి చేసి దానిలో తేనె కలిపి తినాలి. రోజూ 5 గ్రాముల పొడి తింటే చాలు.

స్త్రీలకు వచ్చే తెల్ల బట్ట తగ్గడానికి ,తల్లికి పాలు పడడానికి జిలకర చూర్ణాన్ని పాలతో కానీ, నెయ్యితో కానీ తీసుకోవాలి.తీవ్రమైన జ్వరం తగ్గడానికి వారం రోజుల పాటు జిలకర పొడి ని నీటిలో కలిపి తాగాలి.

జీలకర్ర ను నీటితో తడిపి మెత్తగా నూరి దాన్ని వాపులపై, పైల్స్ పై,చర్మ రోగం ఉన్న చోట రాస్తే అవి నయం అవుతాయి.నీటిలో జిలకర వేసి మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లబరచి ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. చర్మం పై దద్దుర్లు,దురద ఉన్న చోట జిలకర నీటిని పోసి కడగాలి.గాయాలను కడగటానికి కూడా ఈ నీటిని వాడవచ్చు.ఇది యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది.

అతి మూత్రంతో బాధ పడేవారు జిలకర కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.


ఇంటింటా ఆరోగ్యం.. వంటింటి దినుసులతో..

 వంటింట్లో తాలింపు మోత వినకుండా వంట సంపూర్ణం అయినట్లుండదు. పోపుల పెట్టేతో మహిళలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అంతే కాదు, ఆ పోపుల పెట్టె లోనే మహిళల అనారోగ్య సమస్యలను నివారించే పోషకాలూ ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు మొదలుకొని నెలసరి సమస్యలకూ ఉపశమనం లభించే ఆ పదార్థాల గురించి..

 ముత్యమంత పసుపుతో మేలు ఎంతో.. 

ఇంటింటా ఉండే సుగుణాల ఔషధి..పసుపు..మేనికి మేలు ఛాయ ను ఇచ్చే ఈ అద్భుత ఔషధంలో క్యాల్షియం, ఫాస్ఫరస్, థయామిన్ వంటి పోషకాలతో పాటు మహిళల్లో రక్త హీనతను తొలగించే ఇనుమూ , ఎ విటమినులు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కర్కుమిన్ అనే ప్రత్యేక పదార్థానికి క్యాన్సర్ ను ఎదురించి పోరాడే శక్తి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ్. చిన్న పిల్లల్లో నులి పురుగులు సమస్యకు గ్లాసు నీటిలో అర చెంచా పసుపు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది. 

రక్త హీనత నివారించే జీలకర్ర..

ఉప్మా,పులిహోర,కూర ..పదార్థమేదైనా జీలకర్రతోనే నోరూరించే రుచి. కేవలం రుచిని మాత్రమే కాదు మగువల ఆరోగ్యానికి అవసరమయ్యే ఫోలిక్ , ఇనుము లను అందించే శక్తి దీని సొంతం. శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సెలీనియం వంటి ఖనిజాలనూ జీలకర్ర అందిస్తుంది. పైత్యం, కఫం, వాతం, జ్వరం , కడుపు నొప్పి, తల తిరగడం వంటి సమస్యలకు ఇది చక్కటి వైద్యం. కడుపులో వాయువులను నియంత్రిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం జీలకర్రను పొడి కొట్టి కషాయంగా కాచి తాగొచ్చు. నిమ్మ రసంలో కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఐతే అర చెంచా మించకుండా తీసుకోవాలి.

 అధికంగా తీసుకుంటే పంచదార విరుగుడుగా పని చేస్తుంది. 


కొవ్వును తగ్గించే ఆవాలు..

పోపులో చిటపట మంటూ సందడి చేసే ఆవాలు .. శరీరంలోని వ్యర్థాలను బయటికి నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఉంది. మహిళలు తరచూ ఎదుర్కునే నెలసరి సమస్యలు దూరం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముక బలానికి ఉపయోగపడే క్యాల్షియం , రక్త హీనతను నివారించే ఇనుము ఆవాలలో అధికం. వీటిని ముద్దలా నూరుకుని వేడి నీరున్న బకెట్ లో వేసి స్నానం చేస్తే ఒంటి నొప్పులు మాయమవుతాయి. ఆవ నూనె శరీరంలోని అనవసర కొవ్వు పెరగకుండా కాపాడుతుంది. 

ఆవాలకు విరుగుడు పాలు. 


అజీర్ణం తగ్గించే మెంతులు..

పచ్చళ్లలో, తాలింపులో రుచి కోసం ప్రత్యేకంగా వాడే మెంతుల ఉపయోగం అటు మధుమేహ రోగులకు మొదలుకొని ఇటు గర్భిణుల వరకు ఎంతో ఉంది. ఇది పేగుల పని తీరును మెరుగు పరిచి .. అజీర్ణ సమస్యలు తొలగిస్తుంది. చెంచాడు మెంతులను నీటిలో నానబెట్టి మరునాడు తీసుకుంటే రక్తం శుభ్ర పడుతుంది. కొవ్వు, చక్కెర శాతం కొంత వరకు నియంత్రణలోకి వస్తాయి. దీనిలో శరీరానికి మేలు చేసే బీటా కెరోటిన్లు సమృద్ధిగా లభిస్తాయి. గర్భిణులు మితంగా తీసుకుంటే మేలు. 

దీనికి విరుగుడు మంచి నీరు.. 

నెలసరి వెతలు.. ధనియాలతో దూరం..

తల తిరగడం, అధిక ఋతు స్రావం వంటి సమస్యలతో బాధ పడేవారు , వీటిని కషాయంగా కాచి తాగితే ఫలితం ఉంటుంది . జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాలతో పాటు వీటిని తీసుకోవాలి. ఆకలి తగ్గిన వారు వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ధనియాలను రాత్రి నీటిలో కాచి పొద్దుటే తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.. 

కఫం పోగొట్టే మిరియాలు..

శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే మిరియాలు కఫ దోషాలు ఉన్నవారికి బాగా ఉపకరిస్తాయి. రోజూ పాలలో లేదా నీటిలో పొడి వేసి తాగాలి. వీటిలో ఇనుము, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, ఫ్లెవనాయిడ్ లు ఉంటాయి. ఇవి శరీరంలో తేమను పెంచి కఫాన్ని బయటకు నెడతాయి. ఇవి ఉదరంలో వాయువులు పెరగకుండా చూస్తాయి. రక్త ప్రసరణ ను మెరుగు పరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి. అధికంగా దాహం వేసినప్పుడు వీటిని నేతిలో వేయించి మజ్జిగలో కలిపి తీసుకోవాలి. 

వీటికి విరుగుడు మజ్జిగ..

చర్మ వ్యాధులకు.. దాల్చినీ..

రుచిలో తియ్యగా ,వగరుగా , ఘాటుగా అనిపించే దాల్చినీ వల్ల ఎన్నో ఉపయోగాలు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చెక్క, పొడి ఏ రూపంలో తీసుకున్నా .. దీనిలోని సుగుణాలు చర్మ వ్యాధులు ఉన్న వారికి ఇతర ఔషధాలతో పాటు కలిపి వైద్యంగా ఇస్తుంటారు . కఫ, పైత్య సమస్యలతో బాధ పడేవారికి పొడిగా ఇస్తే ఫలితం ఉంటుంది. బ్యాక్టీరియాను వృద్ధి చెందకుండా చేస్తుంది. జలుబు, దగ్గుతో బాధ పడేవారికి దీనిని మిరియాలు, యాలకుల పొడిని సమ పాళ్ళలో కలిపి, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే సమస్య పరిష్కారమవుతుంది. నెలసరి ఇబ్బందులు ఎదుర్కునే వారు దాల్చిన చెక్క పొడి చేసి , తమలపాకు రసం లో కలిపి వారం ముందు నుంచి తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. 

ఇంగువ.. దగ్గు నివారిణి..

పేగుల్లో పెరిగే క్రిములను ,హాని కారక వైరస్లను దూరం చేసే శక్తి ఇంగువకు ఉంది.ఆహారం తేలికగా జీర్ణం అవడానికి ,శరీరంలో వాయువులను నియంత్రించడానికి ఇది దోహదం చేస్తుంది. దీన్ని నెలసరికి ముందు శనగ గింజంత బెల్లం తో కలిపి తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. దగ్గు,ఆయాసంతో బాధ పడుతుంటే దీన్ని పెసర గింజంత తీసుకుని ఉల్లిపాయ రసం, తేనె తో కలిపి పుచ్చుకుంటే గుణం ఉంటుంది.

జలుబు తగ్గించే వాము..

నోట్లో వేసుకోగానే చిరు చేదుగా అనిపించే వాము ..శరీరంలో క్రిములు వృద్ధి చెందకుండా చూస్తుంది.అజీర్ణ సమస్యలను ,అతిసారాన్ని తగ్గిస్తుంది. వామును కాల్చినప్పుడు వచ్చే పొగ జలుబును తగ్గిస్తుంది.కడుపుబ్బరంగా ఉన్నప్పుడు చెంచాడు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.ముఖ్యంగా పాలు పడని వారికి దీని రసం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది.వామును , సైంధవ లవణం తో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది.

వికారం నుంచి ఉపశమనం..

అనేక సుగుణాలు ఉండే వాముని భోజనానంతరం తీసుకుంటే ఆహారం తేలిగ్గా జీర్ణమవ్వడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తాయి.లవంగాలను దంచి నీళ్లలో ఉడికించి తాగితే వాంతులు,వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.తలనొప్పి బాధలో లవంగాలను పాలలో కలిపి పుచ్చుకోవాలి.



Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...