18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జిలకర.. నమలండి కరకర..

 వంటింటి పోపు సామానులలో జిలకర తప్పని సరిగా ఉంటుంది. ఇది విరేచన కారి, జీర్ణకారి, మంచి సువాసన దీని నుండి వస్తుంది. 

ప్రసవం తర్వాత తల్లికి పాలు ఎక్కువగా పడడానికి తెల్ల జీలకర్రను బెల్లం తో కలిపి తినాలి. 

మూత్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి జిలకర పొడి ని చక్కెర తో కలిపి తినాలి.అజీర్ణం,గ్యాస్, కడుపు నొప్పి, అరుచి ,వాంతులు ,ప్రేవులలో పురుగులు పోవడానికి జీలకర్రను వేయించి పొడి చేసి దానిలో తేనె కలిపి తినాలి. రోజూ 5 గ్రాముల పొడి తింటే చాలు.

స్త్రీలకు వచ్చే తెల్ల బట్ట తగ్గడానికి ,తల్లికి పాలు పడడానికి జిలకర చూర్ణాన్ని పాలతో కానీ, నెయ్యితో కానీ తీసుకోవాలి.తీవ్రమైన జ్వరం తగ్గడానికి వారం రోజుల పాటు జిలకర పొడి ని నీటిలో కలిపి తాగాలి.

జీలకర్ర ను నీటితో తడిపి మెత్తగా నూరి దాన్ని వాపులపై, పైల్స్ పై,చర్మ రోగం ఉన్న చోట రాస్తే అవి నయం అవుతాయి.నీటిలో జిలకర వేసి మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లబరచి ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. చర్మం పై దద్దుర్లు,దురద ఉన్న చోట జిలకర నీటిని పోసి కడగాలి.గాయాలను కడగటానికి కూడా ఈ నీటిని వాడవచ్చు.ఇది యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది.

అతి మూత్రంతో బాధ పడేవారు జిలకర కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.


ఇంటింటా ఆరోగ్యం.. వంటింటి దినుసులతో..

 వంటింట్లో తాలింపు మోత వినకుండా వంట సంపూర్ణం అయినట్లుండదు. పోపుల పెట్టేతో మహిళలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అంతే కాదు, ఆ పోపుల పెట్టె లోనే మహిళల అనారోగ్య సమస్యలను నివారించే పోషకాలూ ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు మొదలుకొని నెలసరి సమస్యలకూ ఉపశమనం లభించే ఆ పదార్థాల గురించి..

 ముత్యమంత పసుపుతో మేలు ఎంతో.. 

ఇంటింటా ఉండే సుగుణాల ఔషధి..పసుపు..మేనికి మేలు ఛాయ ను ఇచ్చే ఈ అద్భుత ఔషధంలో క్యాల్షియం, ఫాస్ఫరస్, థయామిన్ వంటి పోషకాలతో పాటు మహిళల్లో రక్త హీనతను తొలగించే ఇనుమూ , ఎ విటమినులు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కర్కుమిన్ అనే ప్రత్యేక పదార్థానికి క్యాన్సర్ ను ఎదురించి పోరాడే శక్తి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ్. చిన్న పిల్లల్లో నులి పురుగులు సమస్యకు గ్లాసు నీటిలో అర చెంచా పసుపు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది. 

రక్త హీనత నివారించే జీలకర్ర..

ఉప్మా,పులిహోర,కూర ..పదార్థమేదైనా జీలకర్రతోనే నోరూరించే రుచి. కేవలం రుచిని మాత్రమే కాదు మగువల ఆరోగ్యానికి అవసరమయ్యే ఫోలిక్ , ఇనుము లను అందించే శక్తి దీని సొంతం. శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సెలీనియం వంటి ఖనిజాలనూ జీలకర్ర అందిస్తుంది. పైత్యం, కఫం, వాతం, జ్వరం , కడుపు నొప్పి, తల తిరగడం వంటి సమస్యలకు ఇది చక్కటి వైద్యం. కడుపులో వాయువులను నియంత్రిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం జీలకర్రను పొడి కొట్టి కషాయంగా కాచి తాగొచ్చు. నిమ్మ రసంలో కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఐతే అర చెంచా మించకుండా తీసుకోవాలి.

 అధికంగా తీసుకుంటే పంచదార విరుగుడుగా పని చేస్తుంది. 


కొవ్వును తగ్గించే ఆవాలు..

పోపులో చిటపట మంటూ సందడి చేసే ఆవాలు .. శరీరంలోని వ్యర్థాలను బయటికి నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఉంది. మహిళలు తరచూ ఎదుర్కునే నెలసరి సమస్యలు దూరం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముక బలానికి ఉపయోగపడే క్యాల్షియం , రక్త హీనతను నివారించే ఇనుము ఆవాలలో అధికం. వీటిని ముద్దలా నూరుకుని వేడి నీరున్న బకెట్ లో వేసి స్నానం చేస్తే ఒంటి నొప్పులు మాయమవుతాయి. ఆవ నూనె శరీరంలోని అనవసర కొవ్వు పెరగకుండా కాపాడుతుంది. 

ఆవాలకు విరుగుడు పాలు. 


అజీర్ణం తగ్గించే మెంతులు..

పచ్చళ్లలో, తాలింపులో రుచి కోసం ప్రత్యేకంగా వాడే మెంతుల ఉపయోగం అటు మధుమేహ రోగులకు మొదలుకొని ఇటు గర్భిణుల వరకు ఎంతో ఉంది. ఇది పేగుల పని తీరును మెరుగు పరిచి .. అజీర్ణ సమస్యలు తొలగిస్తుంది. చెంచాడు మెంతులను నీటిలో నానబెట్టి మరునాడు తీసుకుంటే రక్తం శుభ్ర పడుతుంది. కొవ్వు, చక్కెర శాతం కొంత వరకు నియంత్రణలోకి వస్తాయి. దీనిలో శరీరానికి మేలు చేసే బీటా కెరోటిన్లు సమృద్ధిగా లభిస్తాయి. గర్భిణులు మితంగా తీసుకుంటే మేలు. 

దీనికి విరుగుడు మంచి నీరు.. 

నెలసరి వెతలు.. ధనియాలతో దూరం..

తల తిరగడం, అధిక ఋతు స్రావం వంటి సమస్యలతో బాధ పడేవారు , వీటిని కషాయంగా కాచి తాగితే ఫలితం ఉంటుంది . జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాలతో పాటు వీటిని తీసుకోవాలి. ఆకలి తగ్గిన వారు వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ధనియాలను రాత్రి నీటిలో కాచి పొద్దుటే తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.. 

కఫం పోగొట్టే మిరియాలు..

శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే మిరియాలు కఫ దోషాలు ఉన్నవారికి బాగా ఉపకరిస్తాయి. రోజూ పాలలో లేదా నీటిలో పొడి వేసి తాగాలి. వీటిలో ఇనుము, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, ఫ్లెవనాయిడ్ లు ఉంటాయి. ఇవి శరీరంలో తేమను పెంచి కఫాన్ని బయటకు నెడతాయి. ఇవి ఉదరంలో వాయువులు పెరగకుండా చూస్తాయి. రక్త ప్రసరణ ను మెరుగు పరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి. అధికంగా దాహం వేసినప్పుడు వీటిని నేతిలో వేయించి మజ్జిగలో కలిపి తీసుకోవాలి. 

వీటికి విరుగుడు మజ్జిగ..

చర్మ వ్యాధులకు.. దాల్చినీ..

రుచిలో తియ్యగా ,వగరుగా , ఘాటుగా అనిపించే దాల్చినీ వల్ల ఎన్నో ఉపయోగాలు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చెక్క, పొడి ఏ రూపంలో తీసుకున్నా .. దీనిలోని సుగుణాలు చర్మ వ్యాధులు ఉన్న వారికి ఇతర ఔషధాలతో పాటు కలిపి వైద్యంగా ఇస్తుంటారు . కఫ, పైత్య సమస్యలతో బాధ పడేవారికి పొడిగా ఇస్తే ఫలితం ఉంటుంది. బ్యాక్టీరియాను వృద్ధి చెందకుండా చేస్తుంది. జలుబు, దగ్గుతో బాధ పడేవారికి దీనిని మిరియాలు, యాలకుల పొడిని సమ పాళ్ళలో కలిపి, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే సమస్య పరిష్కారమవుతుంది. నెలసరి ఇబ్బందులు ఎదుర్కునే వారు దాల్చిన చెక్క పొడి చేసి , తమలపాకు రసం లో కలిపి వారం ముందు నుంచి తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. 

ఇంగువ.. దగ్గు నివారిణి..

పేగుల్లో పెరిగే క్రిములను ,హాని కారక వైరస్లను దూరం చేసే శక్తి ఇంగువకు ఉంది.ఆహారం తేలికగా జీర్ణం అవడానికి ,శరీరంలో వాయువులను నియంత్రించడానికి ఇది దోహదం చేస్తుంది. దీన్ని నెలసరికి ముందు శనగ గింజంత బెల్లం తో కలిపి తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. దగ్గు,ఆయాసంతో బాధ పడుతుంటే దీన్ని పెసర గింజంత తీసుకుని ఉల్లిపాయ రసం, తేనె తో కలిపి పుచ్చుకుంటే గుణం ఉంటుంది.

జలుబు తగ్గించే వాము..

నోట్లో వేసుకోగానే చిరు చేదుగా అనిపించే వాము ..శరీరంలో క్రిములు వృద్ధి చెందకుండా చూస్తుంది.అజీర్ణ సమస్యలను ,అతిసారాన్ని తగ్గిస్తుంది. వామును కాల్చినప్పుడు వచ్చే పొగ జలుబును తగ్గిస్తుంది.కడుపుబ్బరంగా ఉన్నప్పుడు చెంచాడు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.ముఖ్యంగా పాలు పడని వారికి దీని రసం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది.వామును , సైంధవ లవణం తో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది.

వికారం నుంచి ఉపశమనం..

అనేక సుగుణాలు ఉండే వాముని భోజనానంతరం తీసుకుంటే ఆహారం తేలిగ్గా జీర్ణమవ్వడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తాయి.లవంగాలను దంచి నీళ్లలో ఉడికించి తాగితే వాంతులు,వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.తలనొప్పి బాధలో లవంగాలను పాలలో కలిపి పుచ్చుకోవాలి.



పొడి దగ్గుకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

 ఘాటైన వాసనలు, కొన్ని పదార్థాలలోని రసాయనాలు ఊపిరి తిత్తులు, గొంతులో ఇబ్బంది కలిగించి అవి దగ్గు రూపంలో బయటకు వస్తాయి. ఒక్కోసారి అలర్జీ, ఇన్ఫెక్షన్ , హృద్రోగాలతోనూ వచ్చే ఆస్కారం ఉంటుంది. 

కడుపులో మంట, ఊపిరి తిత్తులు,గొంతులో వాపు గడ్డలున్నా పొడి దగ్గు వస్తుంది. 

చల్లటి నీళ్ళు తాగ కూడదు,వాడిన నూనెలు , కాలుష్యం, వేపుళ్లు , ఘాటైన సువాసన ద్రవ్యాలు , మానసిక ఒత్తిడి వంటివి సమస్యను రెట్టింపు చేస్తాయి. అలానే ఒక్కొక్కసారి బాగా పండిన అరటి పండు, పెరుగు లాంటివి కఫాన్ని పెంచి దగ్గుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. సమస్య త్వరగా తగ్గుతుంది . దగ్గుతో పాటు కడుపులో మంట కూడా ఉంటే చింతపండునూ పరిమితంగా వాడాలి. 

నానబెట్టిన రెండు బాదం గింజలను తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. అలర్జీ కారణం వల్ల దగ్గు వస్తుంటే మాత్రం దంచిన వెల్లుల్లిని గ్లాసు నీటిలో ఉడికించి రాత్రిళ్ళు తాగాలి. పావు కప్పు నీటిలో ఉల్లి రసం, తేనె, చెంచా చొప్పున వేసుకుని భోజనం చేసిన తర్వాత తాగాలి. 

అర కప్పు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఆవ పొడి వేసి రోజుకి రెండు చెంచాలు స్వీకరించాలి. గ్లాసు పాలలో చెంచా తేనె , చిటికెడు చొప్పున నల్ల మిరియాలు , జీలకర్ర పొడి వేసి తాగాలి. అర కప్పు నీటిలో 5 చుక్కల లవంగ నూనె కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. దగ్గు సమస్య పరిష్కారమవుతుంది. 

ఉసిరి.. ఆరోగ్య సిరి..

 కార్తీక మాసం శిశిర ఋతువు వచ్చిందంటే పుల్లగా వగరుగా ఉండే ఉసిరి కాయలు నోరూరిస్తాయి. పూర్వం నుంచి ఆయుర్వేద అద్భుత ఔషధం గా ఉపయోగించే ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

శ్రీ ఫలం,ధాత్రి, ఆమ్ల ఫలం .. పేర్లతో పిలిచే ఉసిరి కాయల లో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. అదెంత శాతమంటే .. ప్రకృతిలోని మరే పండు , కాయలో లభించనంత. ఉసిరి ఎండినా దీనిలో విటమిన్ సి శాతం ఏ మాత్రం తగ్గదు. అందుకే నిత్యం పది గ్రాముల ఉసిరి రసం, పొడి తీసుకునే వారికి ఇతర మార్గాల్లో సీ విటమిన్ అవసరం లేదంటారు. రోగులకు పత్యం ఆహారంగా దీనిని ఇస్తారు. ఉసిరిలో మధుర, ఆమ్ల, కటు, తిక్త , కషాయ రసాలుంటాయి. గాలిక్, ఆస్కార్బిక్ ఆమ్లాల కారణంగా పులుపు ఏర్పడుతుంది. 

ఔషధ ఉపయోగాలు..ఉబ్బసం,జలుబు , ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడేవారు రోజుకి అర చెంచా ఉసిరి రసం పొడి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోటి పూత, రక్తాల్పత ఉన్నవారు దీనిని గుంట గలగర ఆకు రసం, తేనెతో కలిపి పుచ్చుకోవాలి. 

ముక్కు, నోటి నుంచి రక్తం పడుతుంటే .. రోజుకి రెండు మూడు సార్లు ఒకటి రెండు చెంచాల ఉసిరి రసం స్వీకరిస్తే ఫలితం ఉంటుంది. 

అధిక ఋతు స్రావం,బహిష్టు సక్రమంగా రాని వారు రెండు చెంచాల ఉసిరి పొడిని బియ్యం కడిగిన నీటితో కలిపి తాగుతుంటే మంచిది. ఎముకలు బలహీనంగా ఉన్నవారు పాలు, పండ్ల తో పాటు ఉసిరి పొడి కలిపి తీసుకోవాలి. 

మధుమేహ వ్యాధి స్వల్ప స్థాయిలో ఉన్నవారు ఉసిరి పొడిని నాలుగు చెంచాల కాకర కాయల రసం , అర చెంచా పసుపులో కలిపి పుచ్చుకుంటే సమస్య తగ్గు ముఖం పడుతుంది. 

నెలసరి సక్రమంగా రావాలంటే అరటి ఆకు రసం , అరటి పూల కషాయంలో ఉసిరి పొడిని కలిపి తాగితే ఫలితం ఉంటుంది. 

దీర్ఘ కాలికంగా వేధించే రుమాటిక్ నొప్పులు , కీళ్ల వాతము తో బాధ పడే వారు ఇతర ఔషధాలతో పాటు ఉసిరి కాయ చూర్ణం కలిపి స్వీకరిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

క్యాన్సర్ ప్రారంభ దశలో దీనిని ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలో శక్తి పెరిగి జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.

కడుపులో మంట కు పాలలో ఉసిరి పొడిని కలిపి తీసుకోవడం చక్కటి పరిష్కారం. చూపు తగ్గడం,నరాల బలహీనత వంటి కంటి సమస్యలకు ఉసిరి పోషకంగా సహాయపడుతుంది.

ఉసిరి, వేప పొడిని కలిపి పండ్లు తోమితే నోటి పూత, పళ్ళ తీపి, చిగుళ్ల వాపు తగ్గుతాయి.

జాగ్రత్తలు..

ఉసిరి కాయలను ఎక్కువగా వేడి చేసి తినకూడదు.ఉసిరిని నీడలో ఆర బెడితేనే విటమిన్ సి కోల్పోకుండా ఉంటుంది. 

పచ్చి రసం అధికంగా తీసుకుంటే గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఒక్క చెంచాడు ఉసిరి రసం.. రెండు కిలోల జామ పండ్లు, 18 కిలోల ద్రాక్షలు , మూడు కిలోల మామిడి పండ్లు, 180 కప్పుల ఆవు పాలలో ఉండే .. విటమిన్ సి కు సరిసమానం. 

ప్రతి 100 గ్రాముల పచ్చి ఉసిరిలో తేమ 81.8 గ్రాములు , పీచు 3.4 గ్రాములు , పిండి పదార్థాలు 14 గ్రాములు , పోషకాలు 0.5 గ్రాములు , కొవ్వు 0.1 గ్రా., క్యాల్షియం 15 మి. గ్రా, ఫాస్ఫరస్ 21 మి. గ్రా, ఇనుము 1 గ్రా. విటమిన్ బి 20 మైక్రో గ్రా., విటమిన్ సి 650 నుంచి 900 మి. గ్రా. వరకు ఉంటుంది. 

ముఖం పై మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు

చెంపలు,ముక్కు,నుదురు భాగంలో నల్లని,ముదురు గోధుమ రంగులో మచ్చలు .. ఆయుర్వేద పరిష్కారాలు 

హార్మోన్ల అసమతుల్యత, గర్భ నిరోధక సాధనముల వాడకం,రక్తపోటుకు వాడే మందులు, థైరాయిడ్, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటివన్నీ ఇలాంటి మచ్చలకు కారణం కావచ్చు. జుట్టుకు కృత్రిమ రంగు వేసుకునే వారికీ ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు. ఐతే అతి నీల లోహిత కిరణాల ప్రభావానికి ఈ సమస్య మరింత రెట్టింపు అయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకే సమస్య మొదట్లో ఉన్నప్పుడే తగ్గించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

చర్మానికి సహజ మెరుపు.. తరచూ మంచి నీరు, పళ్ళ రసాలు,మజ్జిగ తీసుకుంటే పోషకాహార లోపాలు తగ్గుతాయి. చర్మ రంగూ మెరుగవుతుంది. క్యారెట్, బీట్రూట్, టమాటా వంటి రసాలూ, ఆ కూర గాయలు చర్మ రంగును సాధారణ స్థితికి తెస్తాయి. అలాగే దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ రసాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. క్యాబేజీ రసం కూడా మేనుకు మేలు చేస్తుంది. ఎండు ఫలాలు, బాదం, వాల్ నట్లు, ఎండు ద్రాక్ష వంటి వాటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. పాలు, చేపలు , చిక్కుడు గింజలు తింటే హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా మచ్చలు తగ్గుతాయి. 

బచ్చలి కూర.. ఆయుర్వేద ఉపయోగాలు..

 కేవలం బచ్చలి కూర తిన్నప్పుడు చర్మం పై దద్దుర్లు , దురద వంటి సమస్యలు రావు. ఐతే బచ్చలి కూర తీసుకున్నప్పుడు ఇతర ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నారో గమనించాలి. అంతే కాదు కొన్ని కాయ గూరలు, పండ్లు సరిగా కడిగి తీసుకోకపోయినా సమస్య వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

బచ్చలి కూరలో విటమిన్ ఏసి కాలయం పీచు పదార్థాలు ఉంటాయి. ఆకుల్లోని జిగురు పేగు పూతను దూరం చేస్తుంది. శరీరానికి చలువనిచ్చ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పైత్యం ,దగ్గు,శ్లేష్మం వంటి వాటిని తగ్గిస్తుంది. 

ఆకులను నూరి కాలిన గాయాల మీద కట్లు కడితే మంటలు తగ్గుతాయి. తలలో వేడి, తల నొప్పి, నిద్రాల్పత,చిరాకు  ఉన్నపుడు దీని ఆకులను కాసేపు తలమీద పెట్టీ కాసేపు ఉంచితే తలలోని వేడి , అలసట తగ్గి నిద్ర పడుతుంది. 

బచ్చలి ఆకులను బాదం జిగురులో కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసి ప్రతి రోజూ ఒక గ్రాము చొప్పున పుచ్చుకుంటే నోటి నుండి రక్తం రావడం, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి.ఐతే బచ్చలి ని అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు పేరుకు పోతుంది.అజీర్ణం తలెత్తుతుంది. దీనికి విరుగుడు ఆవాలు,జీలకర్ర ,మజ్జిగ,ఇంగువ.

అలర్జీకి మూడు వారాల పాటు పసుపు రెండు చిటికెలు ,జీలకర్ర మూడు చిటికెలు ,30 ml గోరు వెచ్చని పాలలో కలిపి పుచ్చుకుంటే తగ్గిపోతాయి.


Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...