ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమ పువ్వు. ఆసేతు హిమాచలమే కాదు, సీమాంతర భూములలోనూ ప్రతిష్టాత్మకంగా వాడే ఖరీదైన మూలిక కుంకుమ పువ్వు. నాటి గ్రీకు సంస్కృతిలోనూ, అరబిక్ ఆచరణలోనూ , వేద కాలపు సంస్కృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్య పోషణ ద్రవ్యమిది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం కుంకుమ పువ్వు.
రుచికరమైన వంటలలోనూ ,రమ్యమైన సౌందర్య సాధనము గానూ రసాయన ఔషధ ద్రవ్యంగానూ విశిష్టమైన ఈ కుంకుమ పువ్వు తనలో పెరగడం వల్ల మన శిఖరోజ్వల ప్రాంతం కాశ్మీరం అయింది. వేరు దుంప కలిగిన ఈ ఊదా రంగు పుష్పాలు గుత్తులు గుత్తులుగా ఈ కాశ్మీరంలోనే ఎక్కువగా పండుతాయి.
ఈ పుష్పాలలోని కీల భాగమే కుంకుమ పువ్వు.పారశీక, బాహ్లిక దేశాలలో పండించినా కాశ్మీర కుంకుమ పువ్వే శ్రేష్ఠమైనది అని భావమిశ్రుడు అంటాడు.
స్త్రీలలో ఇది శ్రోనితా స్థాపకం కనుక కవులు దీన్ని కమ్మ పుప్పొడి లోని మధుర లాలన అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో , అన్ని వర్గాల ప్రజావళి తమ పిండి వంటలలో , సౌందర్య సాధనాలలో, మందు లలో దీన్ని వాడుతున్నారు. దీని దుంప, పువ్వు, కాండం, పై పొర , వేరు, ఆకులు, అన్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో కుంకుమ పువ్వు ఒక భాగమైంది.
వంటకాలకు రుచి..ముఖ్యంగా దీని పువ్వులలో కీల భాగం నుండి వచ్చే పరిమళ భరితమైన పుప్పొడిని తరతరాల నుండి ఈ దేశపు ప్రత్యేక వంటలలో వాడుతున్నారు.
మన పూర్వులే కాదు, మొఘలాయిల అద్భుత మొఘల్ వంటకాలలో ఈ కుంకుమ పువ్వు ను ప్రత్యేకంగా వాడేవారు. చేదుగా, స్నిగ్ధంగా ఉండే ఈ పదార్థం తేనెలా కరిగి మధురమైన పదార్థాలకు, ప్రత్యేకమైన కూరలకు అద్భుతమైన ఆకర్షణ ఇస్తుంది.
ఇది కలిస్తే పిండి వంటలకు లేత ఆరెంజ్ రంగు లాంటి ఛాయ వస్తుంది.అందుకే మధుర పదార్థాలకు,పానీయాలకు , మాంస వంటకాలకు దీన్ని కొంచెం కలుపుతారు. ఆదికాలం నుంచి ముఖ్యమైన వంటకాలలో ..ముఖ్యంగా భారత దేశపు బిర్యానీలో దీన్ని ప్రత్యేకంగా చేరుస్తారు.
హైదరాబాదీ ప్రత్యేక వంటకమైన పక్కీ బిర్యానీలో ఇది ముఖ్యంగా ఉంటుంది. జోధ్ పూరి లస్సీలో ఇది ముఖ్యంగా కలుపబడే ప్రత్యేక పదార్థం.అందుకే దాన్ని లేసన్స్ లస్సీ అంటారు.
భారతీయ ఆయుర్వేదంలో, అరబిక్ యునాని వైద్యంలో దీన్ని వాడతారు.
దివ్యమైన ఔషధం..
ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పుల నుండి వంధ్యత్వం అంటే సంతానం లేకపోవడం దాకా ఎన్నో వ్యాధులలో మందుల రూపంగా దీన్ని వాడతారు.
కుంకుమ పువ్వు ఆస్తమా,జలుబు, ముఖం పై మొటిమలు,కడుపులో నొప్పి, మద్య పానం వంటి వాటికి బాగా పనిచేస్తుంది. దీంతో తయారైన క్రీములు ముఖం పై మచ్చలను పోగొట్టడమే కాకుండా ముఖాన్ని కాంతి వంతంగా చేస్తాయి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఒంట్లో ఉండిపోయిన నీరు పోతుంది.గర్భాశయ,మూత్రాశయ వ్యాధులలో దీన్ని బాగా వాడతారు.గర్భాశయం వాపులలో, పైనున్న చిన్న గడ్డలలో / ఫైబ్రాయిడ్స్ , దీన్ని తేనెతో కలిపి వాడడం మంచిది.దీన్నుంచి తీసిన నూనె గర్భాశయంపై వచ్చే గడ్డలలో చాలా బాగా ఉపకరిస్తుంది.
రాత్రి వేడి పాలలో పటిక బెల్లం,కుంకుమ పువ్వు వేసి తాగితే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అది తాగితే స్త్రీలలో అనుభూతి కలుగుతుంది.పిల్లల్లో శరీరం కాంతి వంతంగా మారుతుంది.
ఒక సీసాలో మూడు ఔన్సుల 100 ప్రూఫ్ ఆల్కహాలు తీసుకుని అందులో మూడు చిటికెల కుంకుమ పువ్వు వేసి గట్టిగా మూత పెట్టండి. దాన్ని అలాగే మూడు వారాలు ఉంచండి. తర్వాత చల్లటి పొడి ప్రదేశంలో కొంత సేపు ఉంచి దాన్ని పావు కప్పు ఒక్కసారి తీసుకోండి.మనసులో వేదన,ఆందోళన పోయి చక్కటి ఉత్సాహం వస్తుంది. కానీ ఇది అలవాటుగా మార కూడదు.
ఆయువు వృద్ధికి..
క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు ముందే చరక సుశ్రుతాది సంహితలలో దీని గురించి ప్రస్తావన ఉంది.కండర గుండెకు బలాన్నిచ్చే ఈ కుంకుమ పువ్వు లేపం ' సంకోచ ' అని పిలవబడుతుంది. పాయసంలో, చక్కెర పొంగలిలో దీన్ని కలిపి తీసుకుంటే ఆయువు పెరుగుతుంది.
USDA ప్రకారం దీనిలో ఎనర్జీ 15.5% ,కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్స్ 21% ఉన్నాయి.విటమిన్లు 77% , మినరల్స్ 37% ,ముఖ్యంగా విటమిన్ ఎ,ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి.
కుంకుమ పువ్వు తీసుకునేటప్పుడు దాని నియమ బద్ధతను చూడండి.ఇంట్లో ఉన్నప్పుడు గాలి వెళ్ళని గట్టి పాత్రలో భద్ర పరుచుకోండి. రోజూ రాత్రి గోరు వెచ్చని పాలలో రెండు చిటికెల కుంకుమ పువ్వు, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే గుండె జబ్బుల వారికి మంచిది. గర్భిణీ కాలంలో రోజూ చిటికెడు కుంకుమ పువ్వు,రెండు గులాబీ రేకులు పాలలో వేసి తాగుతుంటే అందమైన బిడ్డలు పుడతారు. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఈ భారత భూమిని కీర్తించిన వారు ఈ అద్భుత కుంకుమ పువ్వును అందించిన కాశ్మీరాన్ని శీతాచల శిఖరోజ్వలం అని కీర్తించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి