30, అక్టోబర్ 2011, ఆదివారం

డైటింగ్ అంటే ఉపవాసం కాదు..

ఆధునిక సమాజంలో నాజూకుగా ఉండడం కోసం అన్నం మానేసి ,రకరకాల జిమ్స్ లో ఓలలాడుతున్నది యువత. ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలలో వాళ్ళకి తెలియదు కానీ అన్నం మానేయడం వల్ల కొద్ది బరువు తగ్గి, మళ్లీ తింటే మామూలుగా బరువు పెరుగుతారు. అంతేకాదు డైటింగ్ అంటూ తిండి మానేయడం వల్ల శారీరకంగానే కాక, మానసికంగా కూడా ఎన్నో సమస్యలని తెచ్చుకుంటున్నాము.

అనొరెక్సియా నెర్వోసా అనేది మనం అన్నం తినే ప్రక్రియలో వచ్చే ఒక వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్లలో భోజనానికి ముందు కూర్చుంటే ఒళ్ళు వచ్చేస్తుందని భయం ముందుంటుంది .దాంతో భయం భయంగా అతి తక్కువగా తింటారు. సన్నగా అవుతారు కానీ శరీరంలో శక్తి కోల్పోయి, జీవకణాలకు తగినంత ఆహారసారం అందక నిర్వీర్యమై అనేక ఇతర బాధలకు లోనవుతారు. దీని వల్ల మానసిక  దౌర్బల్యం వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

నిరాహారం కూడదు..

మానసిక వ్యాధుల వల్ల వచ్చే మరణాలలో తిండి తినకపోవడం ముఖ్య మూల కారణం. ప్రపంచంలో ఐదు నుండి 20% దాకా మానసిక దౌర్బల్యం కలగడానికి కారణం తిండి తినకపోవడమే..
మనం చేసే పద్ధతిలేని డైటింగ్ వల్ల ముందుగా దెబ్బ తినేది మన ఎముకలు. ఎదిగే వయస్సులో మనం తీసుకునే ఆహార సారం కొంత నిలవ చేయబడి మన ఎముకలు ఎదిగి గట్టిపడడానికి దోహదం చేస్తుంది. అది పెద్దయ్యాక చిరకాలం హాయిగా దృఢంగా జీవించడానికి కారణమవుతుంది. అందుకనే 25 ఏళ్ల లోపు వాళ్లు ఈ భయంతో అన్నం తినడం మానకూడదు.
 మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ,మీరు చేసే ఈ ఉపవాసాల వల్ల నీకు తెలియకుండానే నీ గుండె బలహీనమవుతుంది. పోషకాహార లోపం వల్ల క్రమంగా కండరాలు బలహీనమవుతాయి, ఆ క్రమంలో గుండె కండరాలు కూడా బలహీనమవుతాయి. దానివల్ల గుండె కొంచెం కొంచెం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దానివల్ల రక్తపోటు, పల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ శరీరంలో ప్రాణ శక్తి జీవ కణాలు ఉపయోగించుకునే ఆహారసారం ఏదైతే ఉందో దానిని రసం అంటుంది ఆయుర్వేదం.న్యూట్రియెంట్స్ అంటుంది ఆధునిక వైద్యం. ఆ శక్తిని తగ్గనివ్వకండి.
మీరు ..నేను లావుగా ఉన్నాను ,అన్నం తినకుండా డైటింగ్ చేయాలి ..అని ఒకేసారి ఆలోచించకండి. దానివల్ల లావు తగ్గడం కన్నా, శరీరం, మనసు బలహీనపడతాయి. మీ శరీరపు లావణ్య దారుడ్యాలను, సహజమైన ఆకృతిని మార్చేసుకుంటున్నారు. మీరు సన్నబడ్డారని మిమ్మల్ని చూసిన వాళ్ళు అనవచ్చు. అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే నీరసపడ్డారని తెలుస్తుంది. ఒళ్ళు పెంచే, బరువు పెరిగే ఆహారం తినడం మానుకోవాలి. అలాంటి పనులు చేయకుండా ఉండాలి. అంతేకానీ డైటింగ్ పేర శరీరాన్ని ,ఆత్మని నీరసపరచకూడదు. పదో ఏట నుంచే ఈ డైటింగ్ చేయడం ప్రారంభిస్తే, మరో పదేళ్లు గడిచేటప్పటికి సన్నగా తయారై కండ లేక, ఎముకలు బలహీనమై కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అనొరెక్సియా కి కారణాలు..

మన ఇంట్లో వాళ్ళు లావుగా ఉన్నారని, మనం భయపడి తిండి మానేయడం . మోడలింగ్, యాక్టింగ్ చేయాలనే తపనతో అతిగా డైటింగ్ చేయడం. ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని ,ఏదో దేవుడి పేరిట కటిక ఉపవాసం ఉండడం. మానసిక నిర్లిప్తత, విడాకులు పుచ్చుకోవడం, కావలసిన వాళ్ళు హఠాత్తుగా దూరం అవ్వడం..
 వంటి పరిస్థితుల వల్ల తిండి సహించక , అన్నం మానేయడం .స్కూల్ కి వెళ్లే పిల్లలు.. చదువు, ట్యూషన్స్, పరీక్షల ఒత్తిడిలో  అన్నం మానేయడం.

దీనిని గుర్తించడం ఎలా..

అధికంగా మీ బరువు తగ్గుతున్నప్పుడు.ఒళ్ళు పెరుగుతుందని అన్నం తినేటప్పుడు భయం వేస్తుంటే, అధిక వ్యాయామం చేస్తూ నీరసపడటం. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నిర్లిప్తంగా ,దూరంగా ఉండడం. ఉత్సాహం లేకుండా ఉండడం .చర్మం పొడిబారి, అధికంగా వెంట్రుకలు ఊడిపోతూ ,గోళ్ళు మార్పు చెందడం. నెలసరి బహిష్టు ఆగిపోవడం. ఎప్పుడూ చలిగా ఉంటూ ఉండటం. కాళ్లు చేతులు లాగుతూ ఉండడం. కాళ్లు, ముఖ్యంగా పాదాలు వాయడం. మనిషిలో ఆకర్షణ తగ్గిపోవడం.
కడుపులో ఆకలి ఉన్న, అన్ని తినాలని కోరిక ఉన్న, ఆహారం తీసుకోవడానికి ఆఇష్టపడుతుంటే దానిని ..అరోచకము.. అంటారు ఆయుర్వేదంలో. ప్రముఖ ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ' వాగ్భటులు ' మనస్సంతాపన' వల్ల అన్నం తినకపోవడం వ్యాధిగా పేర్కొన్నారు .అదే మనం తెలియకుండా చేస్తున్న డైటింగ్. ఈ అరుచి వల్ల క్రమంగా జీర్ణ రసాలు మార్పు చెంది ,జీర్ణం కావడానికి కారణమైన జటరాగ్ని మందగించి శరీరం శోషించబడుతుంది. దానివలన నోరు వగరుగా తయారై, పండ్లు పులిసి, దాహం, మంటతో కూడుకుని ..క్రమంగా మనస్సు వ్యాకులత చెంది మోహము ,జడత్వము కలుగుతాయి అంటుంది ఈ జీవశాస్త్రము.

సన్నబడాలంటే..

లావుగా ఉండడం తప్పు కాదు, కాని తగ్గడం చాలా అవసరం. దానికి ఉపవాసం కాదు ఒళ్ళు పెంచే ఆహారం తినకూడదని మనం విశ్వసించాలి.
శరీరపు బరువు సమతుల్యమై ,వ్యక్తి ఆకృతి పాడవకుండా, మనిషి మనసు నీరసించకుండా, ఆత్మస్థైర్యం నిలబడేటట్టు చేసే సహజ ప్రక్రియలను అనుసరించడం మంచిదనే భావన రావాలి.
శరీరపు బరువును పెంచే  తీపి పదార్థాలు, నెయ్యి, పెరుగు మాంసం ,వేపుడు కూరలు,
 నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశనగనూనె, దుంప కూరలు ,మినుముతో చేసే పదార్థాలు తినకండి. 
అన్నం తినే ముందు కనీసం నాలుగు గంటలు రాగి చెంబులో నిలువ ఉంచిన నీటిని కొంచెం తాగండి. రోజు ఉదయం పరగడుపున అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చెంచాన్నర తేనె కలుపుకొని తాగండి. మధ్యాహ్నం నిద్రపోకండి రాత్రి అన్నం తిన్నాక కనీసం వంద అడుగులు నడిచి అప్పుడు పడుకోండి. మజ్జిగ మీ ఒళ్ళు ను పెరగనివ్వదు .రోజుకు కనీసం రెండుసార్లు అయినా మజ్జిగ తాగండి .గంటసేపు నడవడం, బస్కీలు తీయడం, ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం మంచిది. మిరియాలు, అల్లం ,పిప్పలి, ఉసిరికాయ, నిమ్మకాయ, జీలకర్ర ,ధనియాలు, వాము ఇవి మీ ఆహారంలో చారులోనో, కూరలోనో ,పుదీనా పచ్చడిలోనో ఉంచడం మంచిది. అలాగే ఉపవాసాల వల్ల నీరసించి మనసు జడత్వం పొందితే.. జటామాంసి, శంఖపుష్పి, వచ, బ్రాహ్మి వంటి మేధో రసాయనాలు కలిగిన అవలేహ్యం తీసుకోవడం హితకరం. అగ్నితుండ వటి, లశునది వటి, చిత్రవాది వటి, శంఖవటి, హింగ్వాష్టక చూర్ణం వంటివి మీ జీర్ణ క్రియని తిరిగి సమర్థవంతంగా చేస్తాయి. చ్యవనప్రాసలేహ్యము , అశ్వగంధది లేహ్యము, పంచామృత పర్పటీ వంటివి మళ్లీ మీకు శక్తినిస్తాయి. మీ ప్రవర్తనలో మార్పు ,మీ ఆలోచనల్లో మార్పు చాలా అవసరం .అందుకు సమాజ సంభాషణ, వ్యక్తిగత వివరణ, కుటుంబ హితోక్తి వైద్యునిచే /ఫ్యామిలీ డాక్టర్ చే పొందడం అవసరం. అతి బలహీనత వల్ల గుండె వంటి ప్రాణావయవాలను రక్షించుకోవడం కోసం లక్ష్మీ విలాస రసం ,ద్రాక్షారిష్ట, అర్జునా రిష్ట, అమృతారిష్ట వంటివి తీసుకోవడం అవసరం. ఈ జీవితం దేవుడిచ్చిన అపూర్వ వరము .అది మంగళకరమై, మనోజ్ఞమై మనుమడ సాగించడానికి ఈ శరీరము, మనసు నీరసించకూడదు. డైటింగ్ పేరుతో ఉపవాసాలు చేయకండి. హితమైన ,మితమైన సమతుల్య ఆహారంతో, కనీస వ్యాయామంతో సుఖంగా జీవించండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...