Thursday 4 April 2013

రావి చెట్టు / RAVI CHETTU ( PIPAL TREE ) - ఆయుర్వేద ఉపయోగాలు. / AYURVEDAM

రావిచెట్టు ప్రస్తావన మన పురాణాలలో అనేకచోట్ల కనిపిస్తుంది.విష్ణువు ఇచ్చిన వరం తో జ్యేష్టా దేవి రావిచెట్టు మొదలులో నివాసం ఏర్పరచుకుందని ఆదివారాలనాడు రావి చెట్టును తాకరాదని ఇలా రావిచెట్టు గురించిన ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి.అధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదపరంగా కూడా ఈ చెట్టు విశిష్ట స్థానం సంపాదించుకుంది.అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు రావిచెట్టు నుంచి సేకరించిన వస్తువులతో అమోఘమైన వైద్యం చేయవచ్చని తెలుస్తోంది.

1. జీర్ణాశయ వ్యాధులు తగ్గడానికి - 

వాంతులు తగ్గడానికి 

7 ఎండి రాలిన రావి ఆకులు తెచ్చి ,కాల్చి ,నీళ్ళలో వేసి కొంతసేపు ఉంచి వడగట్టి తాగినచో ఏ మందుకూ తగ్గని వాంతులు తగ్గిపోతాయి.

వాంతులు,ఎక్కిళ్ళు తగ్గడానికి.

రావి పట్ట కాల్చి చేసిన బూడిదను నీళ్ళలో వేసి తాగించినచో వాంతులు,ఎక్కిళ్ళు తగ్గును.

కడుపు నొప్పి తగ్గడానికి -

2 రావి ఆకులను ,బెల్లముతో ఇచ్చినచో కడుపు నొప్పి తగ్గును.దీని పండ్లు జీర్ణ శక్తి కలిగించును.దాహమును అణచును,రుచి కలిగించును.తాజా పండ్లు తినినా,లేక నీడలో ఎండించి చేసిన చూర్ణమును అరచేతి గుంటలో పట్టినంత ఉదయాన్నే పుచ్చుకుని నీళ్ళు తాగినచో పై గుణము కనిపించును.

కలరా వాంతులు తగ్గడానికి - 

రావి ఆకులు 2, మిరియాలు 5,లవంగాలు 7,అన్నింటిని కలిపి నీటితో నూరి వడకట్టి ప్రధమమున ప్రతి 15 నిమిషాలకు ,తర్వాత ప్రతి 2 గంటలకొకసారి ఇచ్చినచో కలరా వాంతులు ఆపి కలరా విషమును హరించును.

2. కాలేయ , ప్లీహ వ్యాధులు తగ్గడానికి - 

రావి చెక్క లోపలి మెత్తని భాగము 40 గ్రాములు ,నీటిలో ఒక రాత్రి నానపెట్టి ,దానికి సమభాగం సురేకారం కలిపి అరటి పండు పైన 2 గ్రాములు చల్లి ఉదయం పూట తినిన కొలది పై వ్యాధులు తగ్గును.దీనిని సేవించునప్పుడు పెసర పప్పు పొంగలి మాత్రమే తినాలి.పసరికలలొ ప్రత్యేక గుణం కనిపించును.

ప్లీహోదరము తగ్గడానికి -

రావి ఆకును నీడలో ఎండించి చూర్ణం చేసి బెల్లం కలిపి శనగ గింజంత మాత్రలు చేసి ఉదయం ,సాయంత్రం 4,5 మాత్రలు పుచ్చుకుని వెంటనే సోంపు కషాయం తాగినచో వ్యాధి తగ్గును.

కడుపులో బల్లలు తగ్గడానికి - 

రాగి కొమ్మతో గిన్నె చేసి దానితో నీZటిని తాగుచున్నచో వ్యాధి తగ్గును.

3 . ప్రేగుల వ్యాధులు తగ్గడానికి - 

మలబద్ధకం తగ్గడానికి -

రావి పండ్ల గింజలను నీడలో ఎండబెట్టి చేసిన చూర్ణమును రాత్రులలో పడుకోవడానికి ముందు గుల్కంద్ తో చేర్చి 10 గ్రాముల మోతాదులో సేవించి కాచిన పాలు తాగిన యెడల మలబద్ధకం తగ్గును.

విరేచనం కావడానికి -

రావి చిగుళ్ళను,ఆకులను కషాయం కాచి తాగినచో విరేచనమగును.

కడుపులోని క్రిములు నశించుటకు -

రావి ఆకులను నీడలో ఎండబెట్టి చేసిన చూర్ణమును బెల్లం తో కలిపి 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు రాత్రి పడుకునే ముందు సోంపు ద్రావకం తో ఇచ్చినచో కడుపులోని క్రిములు చనిపోవును.

మొలల బాధ తగ్గుటకు - 

రావి ఆకులను,వేప ఆకులను కలిపి నూరి మొలలపై లేపనం చేసినచో బాధ తగ్గును.

4 . చర్మ వ్యాధులు తగ్గుటకు -

గడ్డలు తగ్గటానికి ,నొప్పులు,పైత్యపు నీరు,వాపు,తీట,గజ్జి,జిల,దురదఒడిసె అడ్డలు,పుండ్లు,తగ్గుటకు-

రావి ఆకులను ఉడికించి వేడి వేడిగా కట్టినచో ,లేక దీని పట్టను నీటితో నూరి పట్టు వేసినచో గడ్డలు కరుగును లేదా పగులును.దీని గంధం పట్టు వేసినచో నొప్పి పాతది ఐనా లేక కొత్తదైనా తగ్గును.దీనిని నూరి లేపనం చేసినచో పైత్యపు నీరు,వాపు తగ్గును.దీని కషాయం తాగించుచూ,కడుగుచూ వచ్చినచో తీట,గజ్జి,జిల ,దురద మొదలగునవి నశించును.ఆకు వెచ్చచేసి కట్టినచో ఒడిసె గడ్డలు నశించును.రావి పట్ట చూర్ణమును పుండ్లపై చల్లినచో మానని వ్రనములు కూడా మానును.రావి ఆకును వెచ్చచేసి కట్టినచో శరీరమందు ముడిపడిన కురుపులు హరించును.రావి ఆకుల కషాయం తీసుకుంటూ ,దానితో పై పైన కడుగుతూ వచ్చినచో చర్మవ్యాధులు నెమ్మదించును.కుష్తువ్యాధి సైతం నెమ్మదించునని తెలుస్తోంది. 

రక్త శుద్ధి కొరకు -

రావి పట్ట,ఆకుల రసం తీసి సేవించినచో రక్తం శుభ్రమగును.గింజలు మెత్తగా నూరి తేనెతో కలిపి  నిత్యము 10 గ్రాములు సేవించినచో సవామేహము,కుష్టు వ్యాధి తగ్గును.

5 .దంత వ్యాధులు తగ్గటానికి -

రావి పుల్లతో పండ్లు తోమినను ,వేరుతో రుద్దినను దంతములు శుభ్రపడి గట్టిగానుండును.రావి పట్టను మెత్తగా నూరి దానితో పండ్లు తోమినచో కదులుచున్న పండ్లు గట్టిపడును.

6 . మూత్రవ్యాధులు తగ్గడానికి -

రావి పట్టను నానబెట్టిన నీటిని గాని కాచి చేసిన కషాయం గాని సేవించినచో సెగరోగము ,మూత్రములోని మంట నివారణ అగును.లేత రావి ఆకులు 7 నూరి నీటిలో కలిపి శుభ్రపరచి ,కలకండ కలిపి తాగినచో మూత్రనాళమంట తగ్గును.రావిచెట్టు పైబెరడు చూర్ణము చేసుకొని నిత్యం 8 గురిగింజల మోతాదులో తినుచూ వచ్చిన మూత్రం ఎక్కువగా వచ్చుట తగ్గును.

7 . మెదడు వ్యాధులు తగ్గటానికి -

రావి చెట్టుకు కొత్తగా పుట్టిన కొమ్మల యొక్క తలలు 10 
,ఆవు పాలలో వేసి ఉడికించి పరగడుపున సేవించుచున్న ఉన్మాదము,అపస్మారం తగ్గును.రావి చిగుర్లు 10 పాలలో ఉడికించి నిత్యం ఉదయం సేవించినచో లేదా రావి ఆకులు లేతవి నీడలో ఎండబెట్టి 5 గ్రాములు నీతిలో వేసి తేనీటివలె కాచి పాలు ,చక్కెర వేసి తాగుచున్నచో మెదడుకు మంచి బలం కలుగును.

జ్ఞాపక శక్తి కొరకు -

పచ్చి రావి పట్టను నీడన ఎండబెట్టి మెత్తగా నూరి చెక్కర ,నెయ్యి కలిపి హల్వాలాగా చేసుకుని సేవించాలి.

స్పృహ తప్పిన వారికి -

రావి పాలు కొన్ని చుక్కలు ముక్కులో వేయాలి.

రావి పాలు,తేనె సమాన భాగాలలో కలిపి నొసటిపై లేపనం చేయాలి.

8 . రొమ్ము వ్యాధులు -

గుండె మంట తగ్గడానికి -

రావి పండ్లు తిన్నచో గుండెలో మంట తగ్గును.తాజావి దొరకనప్పుడు ఎండినవి తినవచ్చు.

దగ్గు తగ్గడానికి -

రావి ఆకులను పెనంపై వేసి దాని మీద గిన్నెను బోర్లించి చుట్టు అంచును పిండిని అతికించి కింద సన్నని మంట చేసి ఆకులు కాలిన తదుపరి తీసి నూరి కొద్దిగా ఉప్పు పొడి కలిపి పెట్టుకోవాలి.దగ్గు వచ్చినప్పుడు కొంచెం కొంచెం గా నాకించాలి.

ఆకులను నీడలో ఎండబెట్టి నూరి కొంచెం శుద్ధి చేసిన తుమ్మ బంక వేసి మాత్రలు చేసి వీటిని నోటిలో వేసుకుని రసం మింగిన దగ్గు నయమగును.

ఉబ్బసపు దగ్గు,ఉబ్బసం తగ్గడానికి -

రావి పట్టను కాల్చి బూడిద చేసి దానిని నీటిలో కలిపి 7 రోజుల తర్వాత ఆ నీటిని శుభ్రపరచి సీసాలోకి తీసుకుని 20 నుంచి 50 గ్రాములవరకు ఉదయం వాడిన ఉబ్బసపు దగ్గు తగ్గును.

రావి పండ్లను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి నిత్యం ఉదయం అరచేతి గుంటలో పట్టినంత తిని నీళ్ళు తాగినచో పురాతన ఉబ్బసం కూడా నయమగును.

9 .జ్వరం తగ్గడానికి -

రావి ఆకుపై యంత్రమును రాసి నాకించిన జ్వరం తగ్గును.యంత్రం వలన గుణం లేకపోయినను ఆకును నాకుటవలన వ్యాధి తగ్గునని వైద్యుల అభిప్రాయము.

10 . పురుష వ్యాధులు - 

రావి పట్ట కషాయం సేవించినచో మూత్రం వెంట పోయే వీర్యమును అరికట్టును.

పచ్చి రావి పట్టను 4 జాములు / 12 గంటలు నీళ్ళలో నాననిచ్చి శుభ్రపరచి దానిలో కలకండ చేర్చి తాగినచో మూత్రంలో వీర్యం పోవుట ,శీఘ్రస్ఖలనము మొదలగు ఇంద్రియ నష్టాలను ఆపి వీర్యాన్ని వృద్ధి చేసి స్థంభన శక్తిని ఇచ్చును.నడుము నొప్పి పోగొట్టి నడుముకు శక్తి కలిగించును.

వెదురు పప్పు మెత్తగా నూరి దానిపై 10 చుక్కలు రావిపాలు వేసి తిని వెంటనే పాలు తాగిన ఇంద్రియ నష్టాన్ని పోగొట్టును.

రావి పండ్లను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ,దానికి సమానంగా చక్కెర చేర్చి ఉదయం ,సాయంత్రం 5 గ్రాముల చొప్పున తీసుకుని పాలు తాగిన యెడల ఇంద్రియ నష్టాన్ని ఆపి వీర్య వృద్ధి చేసి పుంసత్వాన్ని హెచ్చించును.

11 . స్త్రీల వ్యాధులు - 

రావి పండ్లు నీడలో ఎండబెట్టి నూరి పెట్టుకుని స్త్రీలకు ఋతు స్నానమైనది మొదలు 14 రోజులు ఉదయం పూట వారి వారి అరచేతిలో పట్టినంత తిని వెంటనే పాలు తాగినచో గొడ్రాలు తనం పోయి బిడ్డలు కలుగును.

రావి ఊడలు 200 గ్రాములు ,చక్కెర 200 గ్రాములు చూర్ణం చేసుకుని నిలువచేసుకుని నిత్యం 20 గ్రాములు పాలతో 10 రోజులు బిడ్డలు కలగని దంపతులు సేవించినచో సంతానవంతులు అయ్యెదరు.

పధ్యం - 
ఈ 10 రోజులు అయిన తర్వాత దంపతులు సంభోగం చేయాలి.

రావి పట్ట,రావి ఆకు దంచి రసం తీసి ఉపయోగించినచో స్త్రీలకు కలుగు వివిధ స్రావాలు ఆపును.ఒకవేళ రసం రాని యెడల కషాయం కాచి సేవింపవచ్చు.