పల్లెలో బాదం కాయలు కొట్టుకు తినడం ఒక ఆనందం. ఇక్కడే కాదు ప్రపంచమంతా అందరూ తిని ఆనందించేది బాదం పప్పు. ఆధునిక ఆహారంలో సలాడ్ రూపంలో , ఉత్తర భారతంలో బాదం హల్వా రూపంలోనూ ఎడారి దేశాలలో బాదం బిస్కెట్ల రూపంలోనూ , సమ శీతల ప్రాంతాలలో బాదం బ్రెడ్ రూపంలోనూ ధన వంతులు శక్తి సాధనంగా రాత్రి తినే బాదం పలుకుల రూపంలోనూ సర్వదా వాడే చక్కటి శక్తి సాధనం బాదం. ఇంత ప్రాచుర్యం ఎందుకంటే బాదంలో అంతగా పోషక విలువలు ఉన్నాయి కనుక. చూడడానికి చిన్నదైనా,విలువైనది. సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఈ బాదం వేడి ప్రాంతాలైన పశ్చిమ ఆసియా లోని పల్లె ప్రాంతాలలో , తూర్పు ఆఫ్రికాలోనూ విరివిగా పండుతుంది.ఇది ప్రునియా అనే వృక్ష జాతికి చెందినది. ఈ బాదం తెల్లటి పుష్పాలతో కూడి తీయని బాదం కాయను కలిగి ఉండేవి ఒక రకమైతే , ఎర్రని పువ్వులతో కొంచెం చేదుని కలిగిన బాదం కాయలను కలిగి ఉండేవి మరో రకం.
పోషక విలువలు.. మొదటి రకం కొంచెం కోలగా ఉండి నూనె పదార్థాన్ని కలిగి ఉంటుంది. చేదు రకం కాయ పెద్దదిగా విశాలంగా ఉండి 50%నూనె కలిగి ఉంటుంది. ఇందులో కొంచెం నీరు, కరిగే గ్లూకోజు ,amygdalin,cyanid, వంటి పదార్థాలను కలిగి ఉంటాయి. తీపి కలిగిన బాదం పలుకులు పై పెచ్చులు ఒలిచి తీస్తారు. ఆ పై పెచ్చు సంప్రదాయం వైద్యంలో చర్మం పై మసాజ్ చేయడానికి వాడతారు. ఈ తీపి బాదం కాయలలో అసలు పిండి పదార్థాలు ఉండవు. కనుక దీన్ని పొడి చేసి కేకులాగానో, బిస్కెట్ లాగానో తయారు చేస్తారు. ఇవి షుగర్ ఉన్నవారికి చాలా ఉపయోగం. వాళ్ళు తినవచ్చు. అలాగే పిండి పదార్థాలు తక్కువ అవసరమున్న వారు కూడా వాడవచ్చు.
మన దేశంలో తరతరాలుగా బాదం చెట్లు మన జీవితాలలో పెనవేసుకొని ఉన్నాయి. బాదం పప్పులను రకరకాలుగా..తినుబండారాలుగా,పై లేపనాలు గా ఉపయోగించుకుని అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ బాదం చెట్లలో తియ్యగా ఉండే తీపి బాదం చెట్లు,, చేదుగా ఉండే చేదు బాదం చెట్లు ఇంకా సీమ బాదం చెట్లు మొదలైన అనేక రకాలైన బాదం చెట్లు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం మనం తీపి బాదం చెట్టు గురించి చెప్పుకుంటున్నాము. ఈ బాదం ప్రయోగాలను బాగా అర్థం చేసుకుని,ఆచరించి ఇతరులకు కూడా నేర్పవలసిందిగా మనవి.
బాదం చెట్టు పేర్లు.. సంస్కృతంలో బాదామా , నేత్రోపమ అని , హిందీ లో బాదాం అని,తెలుగులో బాదం చెట్టు అని , లాటిన్ లో amygdalus communis & prunus ,emygdalus, ఇంగ్లీషులో almonds sweet అంటారు.
బాదం చెట్టు రూప గుణ ధర్మాలు.. బాదం పప్పు సమ శీతోష్ణ స్వభావంతో ముందుగా వేడి చేసి తర్వాత చలువ చేస్తుంది. శరీర పుష్టిని, వీర్యానికి బలాన్ని కలుగ చేస్తుంది. మేహ, వాత రోగాలను అణచి వేస్తుంది.మూత్రసంచిలో పుట్టే పుండ్లను మాన్పి వేస్తుంది.
అన్ని అవయవాలకు బలమిస్తుంది.
తీపి కలిగిన బాదం పప్పు చక్కటి పోషక విలువలు కలిగి ఉన్నా పైనున్న గోధుమ రంగు పల్చని పొర ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో ఉత్తేజాన్ని కలుగ చేస్తుంది. ఆహారంలో తీసుకునేటప్పుడు మంచి నీటిలో నానబెట్టి పై పొర తీసివేసి తినడం మంచిది. దాని వల్ల లోపలి పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలి. ఈ బాదం పప్పులు బాగున్నాయని, బలమని ఎక్కువగా తినకూడదు. హితమైనా మితంగా తినాలి. ఎక్కువగా తింటే కడుపుబ్బరం కలుగ చేస్తుంది.
కొంత మందికి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది కానీ జ్వరం కాదు. అందుకే బాదం పలుకులు తీయగా, హితమైన వైనా మితంగా అది మందులా , బలం గా పని చేస్తుంది. ఇందులో 20 శాతం మాంస కృత్తులు ఉంటాయి. ఇందులో స్టార్చ్ ఉండదు కనుక పొడిచేసి బిస్కెట్ల రూపంగానో, కేకుల రూపంగానో చేసుకుని షుగర్ వారు వాడుకోవచ్చు. దీనివల్ల కాస్త బరువు కూడా పెరుగుతారు. దీనిలో ఉన్న సున్నితమైన నూనె పదార్థం గట్టిగా ఉన్న పదార్థాన్ని పలుచన చేస్తుంది.
Almonds provide double barelled protection against diabetes and cardiovascular disease.
చలువ చేస్తుంది..
ముఖ్యంగా బిగ బట్టిన ఊపిరితిత్తుల వ్యాధులలో .. ఒక గ్లాసు నీటిలో తొమ్మిది బాదం పలుకులు కాగ పెడితే అవి కరిగి అందులో ఉండే నూనె పదార్థం నీళ్లలో కలిసి పాలుగా మారుతుంది. దీనిని బాదం పాలు అంటారు. ఇది చలువ చేస్తుంది. హృదయాన్ని ఆహ్లాద పరుస్తుంది. బాగా నీరస పడ్డ వాళ్లకి వెంటనే శక్తి రావడానికి దీనిని ప్రతిపాదిస్తారు వైద్యులు. ఇది చిగుళ్ళ వ్యాధులలో హితకరం .బాదం పలుకులు ఒకటి రెండు నెయ్యిలో నూరి చిగుళ్లపై రాసుకుంటే చిగుళ్ల వాపు తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి .బాదం పలుకులు కిడ్నీలో రాళ్ళను కరిగించడంలో చాలా ఉపయోగపడతాయి. గుండె మంట ను ఆర్పే మంచి సాధనం బాదంపాలు . బాదం పాలు దొరకకపోతే నాలుగైదు బాదం పలుకులు తింటే చాలు గుండె మంట, గుండె దడ తగ్గుతుంది. ఒక్కొక్క బాదం పలుకులో ప్రోటీన్ విలువలు చాలా ఉంటాయి. ఒక ఔన్స్ బాదం పొడి లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చాలా చక్కగా జీర్ణం అవుతుంది.
ఇందులో ఆహారానికి అవసరం అయ్యే పీచు పదార్థం కూడా ఉంటుంది. అది కూడా కరిగిపోయే గుణం కలిగిన పీచు పదార్థము.
ఇది మన శరీరంలో అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పు కొలెస్ట్రాల్ లేని శక్తి సాధకాలు. అందువల్ల లావుగా ఉండే వాళ్లు కూడా మితంగా తినవచ్చు.
బాదం పప్పులు అత్యవసరమైన సూక్ష్మ పోషకత్వాలను కలిగి ఉంటాయి. బి 6 ,మెగ్నీషియం వంటివి దీని లో నిక్షిప్తమై ఉన్నాయి .విటమిన్ ఇ కూడా దీనిలో ఉంది. అందువల్ల గుండెను కాపాడుతుంది. ఈ మధ్య జరిగిన వివిధ పరిశోధనలలో క్రమం తప్పకుండా రెండు బాదం పలుకులు తింటే LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని తేలింది.
శక్తి ని పెంచుతుంది.. రోజు కనీసం రెండు బాదం పప్పులు తింటే షుగర్ వ్యాధిగ్రస్తులు జీవనస్థితి మారి ఉత్సాహంగా ఉంటారని పరిశోధనలలో తేలింది. బాదం క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది .దీనిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి మనలో క్యాన్సర్ లక్షణాలను పెరగకుండా కాపాడుతుంది.
బాదం లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ను" ఆనందిన్" అంటారు. ఇది శరీరంలో ఎలర్జీ ని కలుగ చేయదు,
సరి కదా శక్తిని పెంచుతుంది .
చక్కటి టానిక్..
ఒక కప్పు బాదం కాయలు, మూడు కప్పుల నీరు ,ఒక కప్పు తేనె కలిపి నూరి నీళ్లను వడ గట్టండి .అది చక్కటి టానిక్ లా పనిచేస్తుంది.
బాదం లో కొవ్వు పదార్థం లేదు, క్యాలరీలు 59% , ప్రోటీన్ నాలుగు గ్రాములు ,క్యాల్షియం 46 గ్రాములు, మెగ్నీషియం 50 మిల్లీగ్రాములు, పొటాషియం 120 మిల్లీగ్రాములు ఉంటాయి .వేసవిలో ఎండలో మధ్యాహ్నం బాదం పాలు, సాయంత్రం బాదం పలుకులు తినడం హితకరం
ముఖ కాంతికి బాదం..
బాదం పప్పు పొడి 10 గ్రాములు , పన్నీర్ 40 గ్రాములు కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకుని ఆరిన తర్వాత కడుగుతూ ఉంటే ముఖంపై ఉండే మొటిమలు ,మచ్చలు హరించి పోయి చర్మం మృదువుగా మారుతుంది.
కంటి దృష్టిని పెంచేందుకు బాదం పప్పు..
బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్ను లాగే ఉంటుంది. సృష్టి కర్త ప్రజల కంటిచూపు కోసం కంటి ఆకారంతో దీనిని సృష్టించాడు. బాదం పప్పు లు పావు కేజీ ఒక రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయం పై తోలు తీసి నలగ గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే సోంపు గింజలు పావు కేజీ తెచ్చి దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అదే విధంగా పటిక బెల్లం పొడి పావు కేజీ తీసుకుని, ఈ మూడింటినీ కలిపి నిలువ చేసుకోవాలి.
పిల్లలకు ఒక చెంచా మోతాదుగా, పెద్దలకు రెండు చెంచాల మోతాదుగా వేడి పాలలో కలిపి ఇస్తూ ఉంటే నేత్ర దృష్టి అనూహ్యంగా పెరుగుతుంది. ఆరు నెలలు వాడితే కళ్లద్దాలతో ఇక పని లేదని చెప్పవచ్చు.
అంతేగాక మెదడుకు అపారమైన శక్తిని ఇచ్చి , జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది. కృశించిన సర్వాంగాలను పుష్టికరంగా మారుస్తుంది.
దంత ఆరోగ్యానికి.. బాదం పళ్ళ పొడి..
బాదం కాయల పై పెచ్చులు ఎండించి కాల్చి బూడిద చేసి రోజూ పండ్లు తోముతుంటే కదిలే పండ్లు గట్టి పడతాయి. పండ్ల నుండి కారే చీము, నెత్తురు తగ్గి పోతుంది.. పళ్ళు ముత్యాల వలే మెరుస్తాయి.
చర్మ వ్యాధులు తగ్గడానికి..
బాదం పప్పు ను మంచి నీటిలో నానబెట్టి మెత్తగా నూరి పైన లేపనం చేస్తుంటే చర్మం పై పొడలు,మచ్చలు, దురదలు తగ్గి పోతాయి.
మల బద్ధకం తగ్గడానికి..
బాదం పప్పు, అంజీరుతో కలిపి తింటూ ఉంటే సుఖ విరేచనం జరిగి మలబద్ధకం తగ్గి పోతుంది.
అన్ని రకాల రక్త స్రావాలు తగ్గడానికి..
బాదం ఆకులను నీడలో ఎండించి దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదుగా మంచి నీటిలో కలుపుకొని రెండు పూటలా సేవిస్తుంటే ఏ భాగం నుండి రక్తం కారుతున్నా ఆగి పోతుంది.
నెత్తురు బంక విరేచనాలు తగ్గడానికి..
బాదం పప్పు ను నానబెట్టి పై తోలు తీసి మంచి నీటితో మెత్తగా నూరి వడ కట్టిన బాదం పాలను తగు మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే జిగట విరేచనాలు, నెత్తుటి తో పడే బంక విరేచనాలు , కడుపు నొప్పి తగ్గి పోతాయి.
మూత్ర రోగాలకు.. బాదం పప్పు..
పైన తెలిపినట్లు బాదం పాలు తీసి రెండు లేక మూడు పూటలా అరకప్పు మోతాదుగా సేవిస్తుంటే సెగ రోగం తగ్గి పోయి మూత్ర కోశం లోనూ, మూత్ర నాళం లోనూ ఏర్పడిన పుండు మాడి పోతుంది. అలాగే, అతి మూత్రం కూడా తగ్గిపోతుంది. వీర్య వృద్ధి, రక్త వృద్ధి కూడా కలుగుతాయి.
కుక్క కాటు కు.. బాదం పప్పు..
కుక్క కరవగానే బాదం పప్పు ను మెత్తగా నూరి కాటు పైన వేసి కట్టు కట్టాలి. అలాగే బాదం పప్పు, అంజీరు పండు కలిపి లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి పోతుంది.
మంచి బాదం నూనెకు..పరీక్షలు..
వేడిగా ఉన్న రొట్టె పైన కొద్దిగా బాదం నూనె వేసి చిన్న ముక్క తింటే వెంటనే బాదం రుచి మనకు తెలియాలి. అలాగే కొద్దిగా బాదం నూనె ను అర చేతిలో వేసుకుని బాగా రుద్ది వాసన చూస్తే బాదం వాసన రావాలి. ఇదే పరీక్ష.
కేశ సౌందర్యానికి.. బాదం నూనె..
బాదం పప్పు నుండి తీసిన నూనెను కొద్ది కొద్దిగా వెంట్రుకలకు రాసుకుంటుంటే అది కుదుళ్లలోకి దిగి బల పరచి మెదడుకు చలువ చేసి వెంట్రుకలు రాలనివ్వదు. కళ్ళకు కూడా మేలు చేస్తుంది.
బాదం పొడితో.. బంగారు కాంతి..
బాదం పప్పు పొడి 200 గ్రాములు, మంజిష్ట పొడి 15 గ్రాములు, కస్తూరి పసుపు 15 గ్రాములు , జటా మాంసి 15 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి. స్నానం చేసే గంట ముందు తగినంత పొడిని పాలలో గానీ, నీటిలో గానీ కలిపి మెత్తగా నూరి శరీరమంతా రుద్దుకొని ఒక గంట ఆగి తర్వాత స్నానం చేస్తుంటే క్రమంగా శరీరం పైన వచ్చే మచ్చలు, గుల్లలు, పుండ్లు,మొటిమలు, ముడతలు, గుంటలు, దుర్వాసన మొదలైన వన్నీ హరించిపోయి శరీరం కాంతి వంతంగా మారుతుంది.
వెంట్రుకలు.. పట్టులా మారాలంటే..
బాదం నూనె ఒక చెంచా, నిమ్మ నూనె పావు చెంచా నిమ్మ ఆకు రసం 4 చెంచాలు కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే వెంట్రుకలు పట్టు లాగా మృదువుగా మారతాయి.
వేడి దగ్గులకు.. బాదం పప్పు..
8 బాదం పప్పులు, పటిక బెల్లం 20 గ్రాములు, ఆవు వెన్న 20 గ్రాములు కలిపి తింటూ ఉంటే అతి వేడి వల్ల కలిగిన దగ్గులు తగ్గి పోతాయి.